మహేశ్ బాబు నుంచి సన్నీ లియోన్ వరకు.. అందరూ సలాం కొట్టారుగా!
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3.. విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి వెళ్లింది. ఎల్వీఎం-3 .. ఎం4 నుంచి విజయవంతంగా ఉపగ్రహం విడిపోయింది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రాజకీయ, సినీ, ప్రముఖులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీరిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ తో పాటు పలువురు బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు ఉన్నారు. మరి మన సినీ తారలు ఏమని ట్వీట్లు చేశారు ఏమని ప్రశంసించారో చూద్దాం...
దేశ అంతరిక్ష రంగంలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. అంతరిక్ష చరిత్రలో దేశ త్రివర్ణ పతాకం మరోసారి రెపరెప లాడింది. జాబిల్లిపై అన్వేషణ కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చంద్రయాన్-3 విజయవంతంగా జాబిల్లి దిశగా ప్రయాణించే కక్ష్యలోకి చేరింది. ఈ మధ్యాహ్నం 2.35 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ రెండో ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి నిప్పులు చిమ్ముకుంటూ దూసుకెళ్లిన LMV3-M4 రాకెట్.. . చంద్రయాన్ 3ను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది.

దేశ కల సాకారమైన వేళ..:సుమారు 24 రోజుల పాటు ఇది భూ కక్ష్యలోనే ప్రదక్షిణ చేస్తుంది. ఆ తర్వాత 3.5 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది. అనంతరం చంద్రుడి దక్షిణ ధృవంలో ల్యాండ్ అయి.. అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేస్తుంది. దీంతో.. జాబిలిపై ఇప్పటి వరకు ఎవరూ అడుగుపెట్టని దక్షిణ ధృవం దగ్గరికి వెళ్లాలన్న భారత్ దేశ కల ఎట్టకేలకు సాకారమైంది.
దీంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోడీ సహా పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. వీరిలో టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ మహేశ్ బాబు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు. ఇంకా డైలాగ్ కింగ్ మోహన్ బాబు, సాయి ధరమ్ తేజ్, ఎస్ ఎస్ తమన్, మంచు విష్ణు, సిద్ధార్థ్ నిఖిల్ వంటి టాలీవుడ్ యాక్టర్స్.. సోషల్ మీడియా వేదికగా సైంటిస్టులపై ప్రశంసలు కురిపిస్తూ ఇస్రోకు అభినందనలు తెలిపారు. .
సాక్షిగా ఉన్నందుకు ఎంతో సంతోషం.. :మరో బృహత్తరమైన ప్రయోగానికి సాక్షిగా ఉన్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. నేడు చంద్రయాన్ 3ను ప్రారంభించిన సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రత్యేక అభినందనలు. మీరు దేశానికే గర్వకారణం అని ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసలు కురిపించారు మహేశ్ బాబు.

పవన్ కల్యాణ్ ఏం అన్నారంటే.. :జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. చంద్రయాన్ 3 విజయంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇస్రో ప్రయోగం దేశానికే గర్వకారణమని అన్నారు. శాస్త్రవేత్తల కృషిని కొనియాడారు. చంద్రయాన్ -3 విజయవంతమైన శుభ సందర్భంలో.. ఈ మిషన్లో భాగమైన సైంటిస్టులందరికీ పేరు పేరున నా తరఫున హృదయాపూర్వక శుభాకాంక్షలు. అంతరిక్షంలో విజయాలను అందుకుంటున్న అతి కొద్ది దేశాల సరసన భారత్ ఎప్పుడో చేరింది.
కానీ ఇప్పుడు చంద్రయాన్ వంటి ప్రయోగం కారణంగా.. అంతరిక్ష ప్రయోగాల్లో అగ్రరాజ్యంగా ఆవిర్బవించడం యావత్ భారత జాతికి గర్వకారణం. ఎంతో క్లిష్టమైన ఇటువంటి ప్రయోగాల్లో కేవలం అమెరికా, రష్యా, చైనా వంటి దేశాలే ప్రయత్నాలు చేశాయి. ఇప్పుడు భారతదేశం కూడా చంద్రునిపై ప్రయోగాలు చేస్తున్న దేశంగా పేరుగాంచింది. అని పవన్ అన్నారు.
ఇంకా బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, రవీనా టాండన్, సన్నీలియోని, అనుపమ్ ఖేర్, అజయ్ దేవగణ్, ఈషాగుప్తా, సునీల్ శెట్టి, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ మల్హోత్రా, రితేష్ దేశ్ ముఖ్ సహా పలువురు తారలు ఉన్నారు. వీరంతా కూడా ఇస్రోపై ప్రశంసలు కురిపించారు.


Click it and Unblock the Notifications











