వాళ్లు మీదకొచ్చారు , ఆ డైరెక్టరైతే ఫోన్ చేసి .. రజనీకాంత్ మూవీపై ఛోటా కే నాయుడు హాట్ కామెంట్స్
పరభాషా ఇండస్ట్రీలకు చెందిన డైరెక్టర్లు, కెమెరామెన్లు, డ్యాన్స్ మాస్టర్లు, హీరోలు, హీరోయిన్లు తమ అవకాశాలను కొల్లగొడుతున్నారని దేశంలోని చాలా చిత్ర పరిశ్రమలకు చెందినవారు గొడవ చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా కల్చర్ కాబట్టి సరిపోయింది కానీ .. గతంలో వేరే ఇండస్ట్రీలు ఈ విషయంలో నానా రాద్దాంతాం చేశాయి. స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు కూడా ఇలాంటి ఇష్యూలో ఇరుక్కున్నారట. మరి ఈ వివాదాన్ని ఆయన ఎలా డీల్ చేశారో చూస్తే:
తెలుగులో స్టార్ సినిమాటోగ్రాఫర్గా దూసుకెళ్తున్నారు చోటా కే నాయుడు. దాదాపు మూడున్నర దశాబ్థాలుగా తన కెమెరాతో సెల్యూలాయిడ్పై ఆయన మేజిక్ చేస్తున్నారు. కొత్తగా ఎంతోమంది కెమెరామెన్లు వచ్చినా టాలీవుడ్లో ఆయన స్థానం ప్రత్యేకం. డైరెక్టర్లకు, హీరోలకు ఫేవరేట్ సినిమాటోగ్రాఫర్గా చోటా కే నాయుడు గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఫ్యామలీలో అందరూ బాగా చదువుకున్నవారే .. చోటా కే కూడా బాగా సెటిలవుతాడని ఆశపడితే ఆయన మాత్రం ఇండస్ట్రీలో అడుగుపెట్టారు.

చదువుకోకుండా సినిమాలు చూస్తూ గడిపేస్తున్న కొడుక్కి చోటా నాన్న గారు ఓ ప్రామీస్ చేశారు. పదో తరగతి పాస్ అయితే నిన్ను సినిమాల్లోకి పంపిస్తానని చెప్పారట. దీంతో పట్టుబట్టి చదివిన చోటా కే నాయుడు మంచి మార్క్స్తో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ని క్లియర్ చేశారు. ఈ నేపథ్యంలో వాళ్ల నాన్నగారు చెప్పినట్లుగానే చోటా కే నాయుడిని చెన్నై పంపించారు. దర్శకరత్న దాసరి నారాయణరావు దగ్గర పనిలో చేరిన ఆయనను ఫేమస్ సినిమాటోగ్రాఫర్ వీఎస్ఆర్ స్వామి బాగా ప్రభావితం చేశారు. దీంతో స్వామి బాటలోనే చోటా కే నాయుడు కూడా సినిమాటోగ్రాఫర్ అయ్యారు.
1987లో క్రీస్తు జననం సినిమాకు తొలిసారిగా డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ చేసిన చోటా కే నాయుడు .. నాటి నుంచి నేటి వరకు ఎన్నో హిట్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, బెంగాలీ సినిమాలకు ఆయన పనిచేశారు. అంజీ, కొత్త బంగారు లోకం సినిమాలకు బెస్ట్ సినిమాటోగ్రాఫర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డులు అందుకున్నారు చోటా. అయితే తాను కొన్ని భాషా చిత్రాల్లో పనిచేసేటప్పుడు అక్కడి వారు తనను టార్గెట్ చేశారని తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు చోటా కే నాయుడు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. సూపర్స్టార్ రజనీకాంత్ నటించిన బాబా సినిమాకు తాను కెమెరామెన్గా వర్క్ చేశానని, 70 రోజుల్లోగా సినిమాని ఫినిష్ చేయాలని రజనీ టార్గెట్ పెట్టారని, దాంతో కొందరు అసిస్టెంట్స్తో వర్క్ మొదలుపెట్టానని తెలిపారు. ఈ విషయం తెలిసి అక్కడి యూనియన్లు అప్పటి ప్రెసిడెంట్గా ఉన్న దర్శకుడు బాలచందర్కు ఫిర్యాదు ఫిర్యాదు చేశారని నాయుడు చెప్పారు. దీంతో బాబా మూవీ డైరెక్టర్ సురేష్ కృష్ణకు బాలచందర్ ఫోన్ చేసి మేటర్ సెటిల్ చేయాలని చెప్పారని చోటా తెలిపారు.
ఫోన్లో బాలచందర్ ఉండగానే తాను ఆయనకు ఓ ప్రపోజల్ పెట్టానని, హైదరాబాద్లోనూ 30 మంది వరకు తమిళ సినిమాటోగ్రాఫర్లు పనిచేస్తున్నారని.. చెన్నైకి నేను తెచ్చుకుంది కేవలం 9 మందినే , వీళ్లని ఈ నిమిషం నేను పంపించేస్తా, కానీ రేపు 33 మంది హైదరాబాద్ నుంచి చెన్నై వచ్చేస్తారా అని చెప్పినట్లు చోటా పేర్కొన్నారు. అప్పుడు బాలచందర్ నువ్వు ఎవరి తాలూకా అని చెప్పడంతో దాసరి నారాయణరావు పేరు చెప్పినట్లు వెల్లడించారు. అక్కడితో మేటర్ సెటిలైనట్లు చోటా కే నాయుడు తెలిపారు.


Click it and Unblock the Notifications











