చిరంజీవి, ప్రముఖులపై పృథ్వి సెటైర్లు... ఎవరూ ఉద్ధరించలేదు, తొక్కేస్తున్నారని కామెంట్!
Recommended Video
2014 ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వచ్చినపుడు తెలుగు సినీ ప్రముఖులు, పెద్దలు బాబును స్వయంగా కలిసి అభినందించేందుకు క్యూ కట్టారు. కొందరు సోషల్ మీడియా ద్వారా విష్ చేశారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ 150 సీట్ల మెజారిటీతో అఖండ విజయం సాధించినప్పటికీ.... సినీ పెద్దలు స్పందించలేదు. దీనిపై ప్రముఖ కమెడియన్, జగన్ మద్దతుదారుడు పృథ్వి అసంతృప్తితో ఉన్నారు. తెలుగు సినీ అనుకూల పెద్దలారా? ఏది జరుగకూడదనుకున్నారో అదే జరిగిందా? నోట మాట పెగలడం లేదా? రికార్డ్ మెజారిటీతో గెలిచిన జగన్ను అభినందించడానికి పరుచూరి బ్రదర్స్ స్క్రిప్టు రాయలేక పోతున్నారా? అంటూ సోషల్ మీడియాలో స్టేటస్లు పోస్ట్ చేస్తున్నారు.

మాకు అవకాశాలు లేకుండా చేస్తామని బెదిరించారు
నాతో పాటు కృష్ణుడు, జోగినాయుడు ఇలా చాలా మంది కమెడియన్లు వైసీపీ వైపు ఉండటం కొందరు ఇండస్ట్రీ పెద్దలకు నచ్చలేదు. ఎన్నికల ఫలితాల తర్వాత మాకు అవకాశాలు లేకుండా చేస్తామని బెదిరించారు. 23వ తేదీన నాన్ బెయిలబుల్గా అరెస్ట్ అయ్యే వ్యక్తుల్లో పృథ్వి ఒకరంటూ ప్రచారం చేశారని... ఆయన తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.

మేము ఏం తప్పు చేశాం?
మాపై అంత కక్ష పెంచుకోవడానికి మేము ఏం తప్పు చేశాం? ఎన్టీ రామారావు పార్టీ పెట్టినపుడు కృష్ణ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. చిరంజీవిగారు పార్టీ పెట్టినపుడు చాలా మంది తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఎవరి ఇష్టం వారిది. మీరేమీ మమ్మల్ని పెంచి పోషించలేదు... అంటూ పృథ్వి వ్యాఖ్యానించారు.

ఎవరూ మమ్మల్ని ఉద్ధిరించలేదు, తొక్కేస్తూనే ఉన్నారు
మేము చిరంజీవి గారిని స్పూర్తిగా తీసుకుని ఇండస్ట్రీకి వచ్చాం. చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ఇక్కడి వరకు ఎదిగాం. మా వెనకాల ఎవరో ఉండి అద్భుతమైన పాత్రలు ఇచ్చి ఉద్దరించింది లేదు. ఇండస్ట్రీలో ప్రతి రోజూ మమ్మల్ని సామాజిక పరంగా, ఒక వర్గం పరంగా అణగదొక్కుతూనే ఉన్నారని... పృథ్వి తెలిపారు.

మేము ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి కోరుకుంటున్నాం
చంద్రబాబు నాయుడు గతంలో గెలిస్తే మార్నింగ్ ఫ్లైట్లో వెళ్లి ఆయనకు అభినందనలు తెలిపి సాయంత్ర తిరిగి హైదరాబాద్ వచ్చిన ఇండస్ట్రీ పెద్దలు చాలా మంది ఉన్నారు. మరి జగన్ విషయంలో ఎందుకు చేయడం లేదు? మేము ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి ఇండస్ట్రీ నుంచి పెద్దలు వెళ్లి కాబోయే సిఎంను కలిసి అభినందిస్తే ఇండస్ట్రీ బావుంటుందని మా లాంటి వారం కోరుకుంటున్నాం. మోహన్ బాబు గారైనా ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్లి మాట్లాడాల్సిందిగా నా విన్నపం అంటూ పృథ్వి వ్యాఖ్యానించారు.

చిరంజీవితో పాటు అందరినీ టార్గెట్ చేసిన పృథ్వి
బొడ్డు మీద బొప్పాయిలు కొట్టి వయసు ఉడిగిన వయసులో భక్తిమార్గం పట్టిన దర్శకేంద్రుడి కళాత్మక దృష్టికి జగన్ గెలుపు కనిపించలేదా? దగ్గుబాటి సురేష్ బాబు ఆ గెలుపు ఇంకా గుర్తించలేదా? నిర్మాతలకే నిర్మాత, నిర్మాతల తాతలకే తాత అల్లు అరవింద్కు జగన్ గెలుపు వార్త ఎవరూ చెప్పలేదా? ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ రాజ్యంలో కలిపిన చిరంజీవి చెవిన ఈ గెలుపు వార్త ఎవరూ వేయలేదేమో? అంటూ పృథ్వి ఇండస్ట్రీ పెద్దలపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు.


Click it and Unblock the Notifications











