వివాదంలో 'జై బోలో తెలంగాణ' నంది అవార్డు
హైదరాబాద్ : 'జై బోలో తెలంగాణ'కు ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం అవార్డు లభించింది. ఇదే చిత్రానికి ఎన్.శంకర్కు ఉత్తమ దర్శకుడి అవార్డు, గద్దర్కు ఉత్తమ నేపథ్య గాయకుడి అవార్డు లభించాయి. ఈ నేపధ్యంలో కొన్ని వర్గాల నుంచి ఈ అవార్డుపై విమర్శలు వస్తున్నాయి. జై బోలో తెలంగాణ చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ విద్వేషపూరిత చిత్రం అవార్డుకు ఎంపిక చేస్తే బాగుంటుందని మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్ అన్నారు. జై బోలో తెలంగాణకు ఉత్తమ జాతీయ సమైక్యత చిత్రంగా ప్రకటించడం దురదృష్టకరమన్నారు.
ఈ సినిమాలో సంభాషణలు, గీతాలు... ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని చెప్పారు. తోటి భారతీయులను కించపరిచేలా, సీమాంద్రులను భూ దోపిడీదారులుగా చూపారన్నారు. అవార్డులు ప్రకటించిన జ్యూరీ వెనుక రాజకీయ నాయకులు, సంబంధిత మంత్రి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. జాతీయ సమైక్యతను కొల్లగొట్టే విధంగా ఉన్న ఇలాంటి సినిమాకు జ్యూరీ చేసిన సిఫార్సును ప్రభుత్వం ఆమోదించకూడదని.. ఈ ప్రతిపాదనను వెంటనే సీఎం కిరణ్కుమార్రెడ్డి తిరస్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు.
ఈ విషయమై 2011 నంది అవార్డుల కమిటీకి ఛైర్మన్, ప్రముఖ ఛాయాగ్రాహకుడు ఎస్.గోపాలరెడ్డి మాట్లాడుతూ...''ఉద్యమం అనేది చాలా సున్నితమైన విషయం. ప్రస్తుతం తీవ్రంగా నలుగుతున్న ఓ అంశం. దానికి ఓ ప్రేమకథను మేళవించి తీర్చిదిద్దన విధానం 'జైబోలో తెలంగాణ'లో ఆకట్టుకొంది. ఎవరి మనోభావాలనూ నొప్పించకుండా కథ రాసుకోవడం, దాన్ని వెండి తెరపై ఆవిష్కరించడం సామాన్యమైన విషయం కాదు. ఉద్యమ చిత్రాల్లో ఒక్క పాత్ర కూడా పరిధి దాటి ప్రవర్తించలేదు. ఎంతో మదనపడితే తప్ప అలాంటి కథలు తయారుచేసుకోలేరు అనిపించింది'' అని చెప్పారు.
సమాచార పౌరసంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి డి.కె.అరుణ తెలంగాణ వారు అయినందున 'తెలంగాణ' నేపథ్యంగా నిర్మించిన చిత్రాలకు అవార్డులు ఎక్కువ ఇచ్చారని కొందరు అంటున్నారు. అలాగే తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న నేపధ్యంలో ప్రభుత్వం రాజకీయంగా ఆలోచన చేసి అవార్డులు ఇచ్చిందన్న అభిప్రాయం కూడా కొందరు వ్యక్తం చేశారు. అలా అనడం భావ్యం కాదని ఈ చిత్రాలు అవార్డులు సాధించడానికి అర్హమైనవేనని సినీరంగ ప్రముఖులే కొందరు చెబుతున్నారు. 'తెలంగాణ' నేపథ్యంలో నిర్మించిన నాలుగు చిత్రాలకు మొత్తం 12 బహుమతులు వచ్చాయి.


Click it and Unblock the Notifications











