కరోనా ఎఫెక్ట్: రాజశేఖర్ పెద్ద మనసు.. ఆకలితో అల్లాడుతున్న పేదలకు ఆపన్న హస్తం
దేశంలో కరోనా ఎఫెక్ట్ అన్నిరంగాలపై పడింది. ముఖ్యంగా సినిమా రంగం కరోనా కారణంగా విలవిలలాడిపోతోంది. సినిమా షూటింగ్స్ జరగక, షూటింగ్ పూర్తయిన సినిమాలు విడుదలకు నోచుకోక ఈ రంగంలో పనిచేస్తున్న పేద కళాకారుల పరిస్థితి అద్వాన్నంగా తయారైంది. చేతిలో చిల్లిగవ్వ లేక ఆకలితో అలమటిస్తున్నారు కొందరు. ఈ పరిస్థితుల్లో రాజశేఖర్ మరోసారి సాయం అందించేందుకు పెద్ద మనసుతో ముందుకొచ్చారు. వివరాల్లోకి పోతే..

లాక్డౌన్.. దేశంలో పరిస్థితులు
కరోనా కట్టడిలో భాగంగా దేశ వ్యాప్తంగా 21 రోజుల లాక్డౌన్ ప్రకటించింది కేంద్రం. దీంతో రోజువారీ కూలీలకు పని దొరకడం లేదు. పరిశ్రమలన్నీ మూతపడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొనుగోలు శక్తి లేక ఆకలితో పస్తులుండటమే వారికి శరణ్యంగా మారింది. ఎందరో పేదలు అల్లాడిపోతున్నారు.

ప్రతి రోజు పేదలకు అన్నం పొట్లాలు..
ఈ నేపథ్యంలో ఆకలితో అల్లాడుతున్న వారికి తన వంతు సాయం అందిస్తున్నారు హీరో రాజశేఖర్. ప్రతి రోజు 300 నుంచి 500 మందికి రాజశేఖర్ తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అన్నం పొట్లాలను పంపిణీ చేస్తున్నారు. హైదరాబాద్లో నిత్యం ఈ కార్యక్రమం నిర్వహించి పేదల ఆశీర్వాదం పొందుతున్నారు రాజశేఖర్.

రాజశేఖర్ చారిటబుల్ ట్రస్ట్.. నిరుపేద కళాకారులకు
ఇక చలన చిత్ర పరిశ్రమలోనూ షూటింగ్లు రద్దు కావడంతో రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కళాకారులకు తన వంతు సాయం అందిస్తున్నారు రాజశేఖర్. ఇప్పటికే టాలీవుడ్ పెద్దలతో కలిసి పేద కళాకారులకు, పది రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులను రాజశేఖర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందించారు. రాజశేఖర్ బాటలోనే ఎందరో సినీ ప్రముఖులు తమ వంతు సహాయాలు అందిస్తున్నారు.
Recommended Video

చిరంజీవి సారథ్యంలో..
మరోవైపు సినీ కార్మికులను ఆదుకునేందుకు గాను చిరంజీవి ఆద్వర్యంలో 'కరోనా క్రైసిస్ ఛారిటీ' ఏర్పాటు చేశారు. సినీ రంగంలోని కార్మికుల సహాయార్థం ఈ ఛారిటీకి పెద్దఎత్తున విరాళాలు అందిస్తున్నారు నటీనటులు. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, ప్రభాస్, అల్లు అర్జున్, లావణ్య త్రిపాఠి, ప్రణీత, బ్రహ్మజీ లాంటి ఎందరో ముందుకొచ్చి 'కరోనా క్రైసిస్ ఛారిటీ'కి అండగా నిలిచారు.


Click it and Unblock the Notifications











