కరోనా ఎఫెక్ట్: ముందుకొచ్చిన కొరటాల శివ.. తన వంతుగా సాయం
దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజు రోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఓ వైపు పనులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న జనం.. మరోవైపు కరోనా భయంతో వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రజాక్షేమం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
కరోనా వైరస్ కట్టడి చేస్తూనే ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి అండగా నిలుస్తూ మా వంతుగా సాయం అందిస్తాం అంటూ ముందుకొస్తున్నారు పలువురు సినీ ప్రముఖులు. కరోనా మహమ్మారిపై పోరాటానికి నడుం బిగిస్తూ ఆర్థిక సాయం ప్రకటిస్తున్నారు.

ముఖ్యంగా తెలుగు చిత్రసీమ నుంచి ప్రభుత్వానికి మద్దతు పెరుగుతోంది. కరోనా నివారణకై ప్రభుత్వం తీసుకుంటున్న సహాయక చర్యల నిమిత్తమై ఇప్పటికే నితిన్, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, రామ్ చరణ్, అనిల్ రావిపూడిలు ముఖ్యమంత్రుల సహాయ నిధులకు ఆర్థిక సాయం ప్రకటించగా.. తాజాగా డైరెక్టర్ కొరటాల శివ కూడా ముందుకొచ్చారు.
రూ.5 లక్షల చొప్పున విడివిడిగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి విరాళం ప్రకటించారు కొరటాల శివ. సామాజిక కోణంలో సినిమాలు తీయడంతో దిట్ట అయిన ఈ డైరెక్టర్ ప్రస్తుతం చిరంజీవితో 'ఆచార్య' మూవీ రూపొందిస్తున్నారు. కరోనా కారణంగా దేశంలో లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్ వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











