దక్షిణాది సినీ పరిశ్రమకు 2 వేల కోట్ల తీరని నష్టం.. కరోనా దెబ్బ టాలీవుడ్పై ఎంతంటే..
ప్రాణాంతక వ్యాధి కరోనావైరస్ కోరలు చాచిన నేపథ్యంలో సినిమా పరిశ్రమపై భారీ ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ వైరస్ ప్రభావం వేసవికాలం మొత్తంగా ఉండే అవకాశాలు ఉన్నాయని పలువురు నిర్మాతలు, డిస్టిబ్యూటర్లు పేర్కొన్నారు. ఇదే తీవ్రత మరికొన్ని రోజులు కొనసాగితే ఈ దెబ్బ భారీగా పడే అవకాశాలున్నాయంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్ పరిశ్రమపై రూ.800 కోట్ల మేర నష్టం వాటిల్లే ప్రమాదముందనే హెచ్చరికల నేపథ్యంలో దక్షిణాది సినిమా పరిశ్రమ ఆందోళనకు గురవుతున్నది. రానున్న రోజుల్లో సౌత్ ఇండస్ట్రీపై ఏ మేరకు నష్టం వాటిల్లనున్నదనే అంశంపై మరిన్ని వివరాలు..

కరోనా విజృంభణతో
కరోనావైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాలు ముందస్తు జాగ్రత్తలకు ఉపక్రమించాయి. జనసమర్ధవంతమైన ప్రాంతాల్లో మాల్స్, హోటల్స్, ఆలయాలను ఇతర భవన సముదాయాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశాయి. అలాగే షాపింగ్ మాల్స్, మల్టీఫ్లెక్స్, సినిమా హాళ్ల మూసివేతకు అల్టిమేటం ఇచ్చాయి. దాంతో వ్యాపార ప్రాంగణాలు వెలవెలపోతున్నాయి.

నిర్మాతల్లో ఆందోళనలు
సినిమా ఇండస్ట్రీపై భారీగా నష్ట్ర ప్రభావం ఉంటుందని పలువురు నిర్మాతలు, డిస్టిబ్యూటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు. ఇంతటి ప్రభావం గత 50 ఏళ్లలో ఏ విపత్తు వచ్చినా చవిచూడలేదు అని నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ అన్నారు. భారీ సినిమాల విడుదల వాయిదా పడితే ఇండస్ట్రీ ఇప్పట్లో కోలుకోవడం కష్టమే అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

2 వేల కోట్లకుపైగానే
ఇక నష్ట ప్రభావం కేవలం దక్షిణాది మొత్తం ఉంటుందని, ఇప్పటికిప్పుడు అంచనా వేస్తే రూ.2 వేల కోట్లకుపైగానే నష్టం వాటిల్లే పరిస్థితులు నెలకొని ఉన్నాయని నిర్మాత రామ సత్యనారాయణ తెలిపారు. తెలుగులో ఈ నష్ట ప్రభావం వేసవి మొత్తానికి సుమారు రూ.500 కోట్లు ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు. చిన్న చితకా సినిమాలు పక్కన పెడితే.. పెద్ద హీరోల సినిమాలు ఆగిపోవడం నిర్మాతలకు తలనొప్పిగా మారే అవకాశముందన్నారు. మలయాళ చిత్ర పరిశ్రమకు 250 కోట్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

భారీ బడ్జెట్ చిత్రాలపై దెబ్బ
సాధారణంగా వేసవి కాలం వస్తుందంటే పెద్ద హీరోల సినిమాలు క్యూ కడుతుంటాయి. ఈ వేసవిలో కూడా నాని వీ మూవీ, అనుష్కశెట్టి నటించిన నిశ్శబ్దం, తమిళంలో విజయ్ నటించిన మాస్టర్, సూర్య నటించిన మరో చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇవియే కాకుండా ఒరే బుజ్జిగా, రెడ్, నో టైమ్ టూ డై, ఉప్పెన, 83, అల్లుడు అదుర్స్ సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. ఇవన్నీ వరుసగా విడుదలైతే ఒక సినిమా మరో సినిమాకు పోటీగా మారి కలెక్షన్లపై దెబ్బ తీసే అవకాశం ఉందని పలువురు డిస్టిబ్యూటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. మలయాళంలో మమ్ముట్టి వన్ సినిమా రిలీజ్కు సిద్ధమవుతున్నది. ఎంత లేదన్నా ఆ సినిమా వాయిదా పడితే రూ.50 కోట్ల మేరకు నష్టం వాటిల్లుతుందనే ట్రేడ్ వర్గాల సమాచారం.


Click it and Unblock the Notifications











