మోహన్ బాబుపై కేసు: కోర్టు ఆదేశం
హైదరాబాద్ : దేనికైనా రెడీ సినిమాకు సంబంధించి మోహన్ బాబు, తదితరులపై కేసు నమోదు చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. 'దేనికైనా రెడీ' చిత్రం నటీనటులు, దర్శక, నిర్మాతలు, సెన్సార్ బోర్డు సభ్యులపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. సినిమాలో తమను కించపరిచేలా ఉన్న సన్నివేశాలను తొలగించాలని బ్రాహ్మణులంతా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై హైదరాబాద్ కొత్తపేటకు చెందిన వ్యాపారవేత్త సి.రఘునాథరావు పిటిషన్ దాఖలు చేశారు.
సినిమాలో బ్రాహ్మణులను కించపరిచారని, వారి మనోభావాలు దెబ్బతినే విధంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని రఘునాథ రావు కోర్టుకు విన్నవించారు. రంగారెడ్డి జిల్లా 13వ మెట్రోపాలిటన్ కోర్టు దానిని విచారణకు స్వీకరించింది. పిటిషన్పై మంగళవారం విచారణ జరిపి కేసు నమోదు చేయాలని ఆదేశించింది.
అనంతరం సినిమా నటీ నటులు, దర్శక నిర్మాతలు, సెన్సార్ బోర్డు సభ్యులపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో చైతన్యపురి పోలీసులు 120బి, 153ఎ, 295ఎ, 420 ఐపీసీ సెక్షన్ల కింద 17 మందిపై మంగళవారం కేసు నమోదు చేశారు. దేనికైనా రెడీ సినిమా ఇప్పటికే పలు వివాదాల్లో ఇరుక్కుంది.
నిందితులు: 24 ఫ్రేమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత (ఎ1), మంచు మోహన్బాబు (ఎ2), దర్శకుడు నాగేశ్వర్రెడ్డి (ఎ3), మంచు విష్ణువర్థన్ (ఎ4), కథానాయిక హన్సిక (ఎ5), క్యారెక్టర్ ఆర్టిస్టులు సురేఖావాణి (ఎ6), బ్రహ్మానందం (ఎ7), ధర్మవరపు సుబ్రహ్మణ్యం (ఎ8), ఏవీఎస్ (ఎ9), సెన్సార్ బోర్డు సభ్యులు పద్మజారెడ్డి (ఎ10), సునీతాచౌదరి (ఎ11), నాగులాపల్లి పద్మిని (ఎ12), రేవతి గౌడ్ (ఎ13), అనురాధా పద్మావతి (ఎ14), కోటిబాబు (ఎ15), కర్నాటి విద్యాసాగర్ (ఎ16), బీవీ సాయిసుబ్రహ్మణ్యం (ఎ17), సూర్యప్రకాశ్ (ఎ18), సెన్సార్ రివైజ్డ్ కమిటీ ప్రిసైడింగ్ అధికారి శేఖర్బాబు (ఎ19).


Click it and Unblock the Notifications











