బండ్ల గణేష్పై క్రిమినల్ కేసు.. స్టార్ ప్రొడ్యూసర్పై ఫిర్యాదు చేసిన మహిళ ఎవరు?
చిత్ర పరిశ్రమలో తొలుత నటీనటులు, రచయితలు, సాంకేతిక నిపుణులు, డైరెక్టర్లుగా పనిచేసి .. ఆ తర్వాత నిర్మాతలుగా మారినవారు ఎందరో. అలా సాధారణ నటుడిగా కెరీర్ను ప్రారంభించి బడా ప్రొడ్యూసర్గా మారాడు బండ్ల గణేష్. సినిమాలతో పాటే రాజకీయాల్లోనూ ఎంట్రీ ఇచ్చి కాంటెపరరీ ఇష్యూస్పై కామెంట్ చేస్తూ అనవసర వివాదాల్లోకి దూరుతూ వుంటారు గణేష్. ఏదో ఒకటి రెండు సార్లయితే పర్లేదు.. కానీ ఆయన మాత్రం తగ్గరు.
ఇదిలావుండగా.. బండ్ల గణేష్పై హైదరాబాద్ ఫిల్మ్నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఫిల్మ్ నగర్లో తనకు చెందిన రూ.75 కోట్ల విలువైన ఇంటిని కబ్జా చేసేందుకు బండ్ల గణేష్ ప్రయత్నిస్తున్నారని హీరా గ్రూప్ సీఈవో నౌహీరా షేక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంట్లో బండ్ల గణేష్ అద్దెకు వుంటున్నారని.. అయితే అక్కడ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటమే కాకుండా , ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని నౌహీరా ఆరోపించారు. ఇంటినీ ఖాళీ చేయమని అడిగేందుకు వెళ్లిన తనను నిర్బంధించి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇంత జరిగినా తన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదని.. పైగా తన మీదనే కేసు నమోదు చేయడంతో నౌహీరా డీజీపీకి ఫిర్యాదు చేశారు. మంచిగా ఇళ్లు ఖాళీ చేయమని అడిగితే.. తమపై దౌర్జన్యం చేసి, తామే దౌర్జన్యం చేసినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సదరు ఇంటిపై తొలుత 11 నెలల రెంట్ అగ్రిమెంట్ చేసుకోగా.. ఆ తర్వాతనే ఖాళీ చేయాలని కోరామని, గడువు ముగిసినా ఖాళీ చేయకుండా అందులోనే నివసిస్తున్నారని నౌహీరా తెలిపారు. ఉన్నతాధికారుల ఫిర్యాదు మేరకు బండ్ల గణేష్పై ఫిలింనగర్ పొలీసులు కేసు నమోదు చేశారు.
అయితే బండ్ల గణేష్ కుటుంబ సభ్యుల వెర్షన్ మరోలా వుంది. కొద్దినెలలుగా నౌహీరా - గణేష్ మధ్య ఈ ఇంటిపై వివాదం నడుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 15న నిర్మాత కుమారుడు హిరేష్ ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో నౌహీరాపై ఫిర్యాదు చేశాడు. ఈ కేసు ఎఫ్ఐఆర్ ప్రకారం .. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు పరిధిలో వున్న ఇంటిని నౌహీరా తమకు విక్రయించడానికి ప్రయత్నించారని హిరేష్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ డీల్ కోసం తొలుత ఆమెకు రూ.5 కోట్లు చెల్లించామని.. నౌహీరా 10 మందితో కలిసి ఇంట్లోకి చొరబడ్డారని, ఇంటిని ఖాళీ చేయాలని బెదిరించారని హిరేష్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

రూ.5 వేల కోట్ల విలువైన మనీలాండరింగ్కు పాల్పడిన అభియోగాలు నౌహీరా షేక్పై వున్నాయి. హీరా గోల్డ్ సంస్థల ద్వారా ఆమె తెలుగు రాష్ట్రాల్లో ప్రజల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డారు. హీరా గోల్డ్ కుంభకోణం కారణంగా దాదాపు 1.72 లక్షల మంది మోసపోయినట్లు అంచనా. ఈ కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోంది. దీనికి సంబంధించి గతంలో నౌహీరా షేక్కు చెందిన రూ.367 కోట్ల ఆస్తిని, గతేడాది మరో రూ.33.06 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
మనీలాండరింగ్ కేసులో 2018 అక్టోబర్లో నౌహీరాను అరెస్ట్ చేశారు. కానీ హీరా గ్రూపులో పెట్టుబడులు పెట్టిన వారెవ్వరినీ తాను మోసం చేయలేదన్నారు నౌహీరా. ప్రతి ఒక్కరికి పెట్టిన ప్రతి రూపాయి తిరిగి చెల్లిస్తానని, ఇన్వెస్టర్ల డబ్బును కోర్టుల్లో డీడీ రూపంలో డిపాజిట్ చేశానని ఆమె తెలిపారు. రాజకీయ ఒత్తిళ్లతోనే తనపై అక్రమ కేసులు పెట్టారని .. ఇలాంటి వాటికి భయపడేది లేదని నౌహీరా గతంలో అన్నారు. తాజాగా బండ్ల గణేష్ వ్యవహారంతో మరోసారి ఆమె పేరు తెలుగునాట మారుమోగుతోంది.


Click it and Unblock the Notifications











