రాంగోపాల్ వర్మ దెబ్బకు పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన యంగ్ డైరెక్టర్
సంచలన దర్శకుడు రాంగోపాల్ ఏది చేసినా హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. ఇప్పటికే ఆయన ఎన్నో సార్లు తన విచిత్ర వైఖరితో వార్తల్లోకి ఎక్కారు. ఇక, రెండు వారాల క్రితం పూరీ జగన్నాథ్ - రామ్ కాంబినేషన్లో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా గురించి రచ్చ రచ్చ చేశారు. ఈ సందర్భంగా వర్మ చేసిన పనికి ఓ దర్శకుడు బుక్కైపోయాడు. వివరాల్లోకి వెళ్తే...
రాంగోపాల్ వర్మ 'ఇస్మార్ట్ శంకర్' సినిమా చూడ్డానికి వెళ్లిన విషయం సంచలనం అయింది. దీనికి కారణం ఆయన చేసిన ప్రకటనే. ట్విట్టర్ వేదికగా ''హేయ్ పూరీ జగన్నాథ్ అండ్ ఛార్మీ కౌర్.. నా అసిస్టెంట్స్ ఆర్ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి, లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫేం అగస్త్య మంజులతో కలిసి మధ్యాహ్నం 2 గంటల ఆట చూడటానికి ముసాపేట శ్రీరాములు థియేటర్కు వెళ్తున్నా. ముగ్గురం బైక్పై వెళ్తున్నాం. అది కూడా మాంచి మాస్ గెటప్పులలో వెళ్తున్నాం'' అంటూ ఆయన ట్వీట్ చేశారు.

దీనికి తగ్గట్లే మరో ఇద్దరు దర్శకులతో కలిసి బైకుపై సినిమాకు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోలను సైతం ఆయన తన సోషల్ మీడియా ఖాతాల్లో ఉంచారు. అదే సమయంలో పలువురు నెటిజన్లు కూడా దీన్ని ట్రాఫిక్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన సైబరాబాద్ పోలీసులు బైక్కు చలానా వేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
హెల్మెట్ లేకపోవడం, ట్రిపుల్ రైడింగ్కు కలిపి రూ.1300 జరిమానా విధించారు. అలాగే డ్రైవింగ్ చేసిన అజయ్ భూపతిని కౌన్సెలింగ్కు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. దీంతో శనివారం సాయంత్రం ఆయన హైదరాబాద్లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జరిగిన కౌన్సెలింగ్కు వచ్చారు. అజయ్ భూపతికి ట్రాఫిక్ నిబంధనలపై పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోలను షేర్ చేశారు.


Click it and Unblock the Notifications











