డబ్బింగ్ సినిమాల వేటుపై డి సురేష్ బాబు
డబ్బింగ్ సినిమాపై వేటు వెయ్యాలని తెలుగు సినీ పరిశ్రమ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై నిన్న(సోమవారం)నిర్మాతల మండలిలో ఆధ్వర్యంలో చర్చ జరిగింది. డబ్బింగ్ సినిమాలపై పన్ను పెంచడం, సంక్రాంతి, దసరా లాంటి సమయాల్లో విడుదలయ్యే తెలుగు చిత్రాలకే ప్రాధాన్యమీయడం లాంటి అంశాలపై ప్రతిపాదనలు వచ్చాయి. ఈ విషయమై సురేష్ బాబు మాట్లాడుతూ...''మన తెలుగు సినిమాను ఏ విధంగా నిలబెట్టుకోవాలీ అన్న విషయమ్మీద చర్చిస్తున్నాం. పొరుగు రాష్ట్రాలకు మన చిత్రాలు అనువాదమై వెళ్లినప్పుడు ఎంత పన్ను వేస్తున్నారో పరిశీలించాలి. ఆ స్థాయిలోనే అక్కడి నుంచి అనువాదమై ఇక్కడికి వస్తున్నవాటికీ పన్ను వేయాలి. ప్రస్తుతం మన దగ్గర అనువాదాలపై 20 శాతం పన్ను ఉంది. అదే తమిళనాడులో తెలుగు అనువాదాలపై ఎంత వేస్తున్నారో చూడాలి. ఇక్కడా అంతే విధించేలా చూడాలి. అలాగే ముఖ్యమైన సీజన్లలో నేరుగా తెలుగులో నిర్మితమైన చిత్రాలకే థియేటర్లు లభించేలా, వాటికే ప్రాధాన్యమిచ్చేలా చూడాల్సిన అవసరం ఉంది. ఈ విషయమై ఎగ్జిబిటర్లతోనూ మాట్లాడాం.
ప్రస్తుతం థియేటర్లలో నాలుగు ఆటలు ప్రదర్శిస్తున్నాం. అయిదో ఆటకీ అనుమతినీయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ అదనపు ఆట చిన్న చిత్రాలకు కేటాయించాలి''అన్నారు. అయితే ప్రేక్షకులు మాత్రం ఈ విషయమై అసహనం వ్యక్తం చేస్తున్నారు. విడుదల అవుతున్న డబ్బింగ్ చిత్రాలకు పోటీగా విషయం ఉండే సినిమాలు తెలుగులో వచ్చేలా ఏం చెయ్యాలో చర్చించాలి కానీ డబ్బింగ్ సినిమాలు ఆడుతున్నాయని వాటిపై వేటు వేసి ఆపటం ఎంత వరకూ సమంజసం అంటున్నారు. ఇక మొన్న దీపావళి రోజు సూర్య నటించిన సెవెంత్ సెన్స్, షారూఖ్ ఖాన్ నటించిన రా వన్ చిత్రాలు విడుదల అయ్యి, ఒక్క తెలుగు సినిమా కూడా పండగ రోజు విడుదల కాకపోవటంతో ఈ చర్చలు మొదలయ్యాయి.


Click it and Unblock the Notifications











