Mithun Chakraborty : మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే!
భారతీయ సినీ రంగంలో అత్యంత కీలకంగా భావించే 70వ జాతీయ ఉత్తమ చలన చిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. 2022లో దేశవ్యాప్తంగా సుమారు 28 భాషల్లో విడుదలైన 300కు పైగా చిత్రాల నుంచి అందిన నామినేషన్లను 11 మందితో కూడిన జ్యూరీ పరిశీలించి ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను అధికారికంగా ప్రకటించింది. 1 జనవరి 2022 నుంచి 31 డిసెంబర్ 2022 మధ్య సీబీఎఫ్సీ సర్టిఫై చేసిన ఫీచర్, నాన్ ఫీచర్ చిత్రాలకు ఈ పురస్కారాలను ప్రకటించారు.
ఈ అవార్డుల్లో తెలుగు హీరో నిఖిల్, కన్నడ నటుడు రక్షిత్ శెట్టి తదితరులు తమ ప్రతిభను చాటుకొన్నారు. అంతాబాగానే ఉంది కానీ.. ఈ ఏడాది భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యున్నత పురస్కారంగా అభివర్ణించే దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని కేంద్రం ఎవరికి ప్రకటించనుందనే అంతా ఎదురుచూశారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ ఉత్కంఠకు తెరదించింది. మరి ఈ ఏడాది దాదాసాహెబ్ ఫాల్కేను అందుకోబోతున్న నటుడు ఎవరో చూస్తే:

భారతీయ చిత్ర పరిశ్రమ పితామహుడిగా ప్రఖ్యాతి గాంచిన దాదాసాహెబ్ఫాల్కే పేరు మీదుగా ఈ పురస్కారాన్ని ప్రతియేటా అందిస్తున్నారు. రాజా హరిశ్చంద్ర అనే మూకీ సినిమాను తీసి భారత్లో సినీ పరిశ్రమ ఏర్పాటుకు బీజాలు వేశారు ఫాల్కే . ఆ తర్వాత భస్మాసుర్ మోహిని , లంకా దహన్, శ్రీకృష్ణ జన్మ, సైరందధ్రి, శకుంతల వంటి సినిమాలను తీశారు. భారతీయ చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలకు గాను ప్రతియేటా ఫాల్కే పేరు మీద అవార్డును ఏర్పాటు చేసింది. 1969లో ప్రముఖ నటి దేవికా రాణికి తొలి అవార్డ్ అందజేశారు. తెలుగు వారి విషయానికి వస్తే.. కే . విశ్వనాథ్, అక్కినేని నాగేశ్వరరావు, డి. రామానాయుడు వంటి వారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ వరించింది.
ఈ ఏడాది బాలీవుడ్ దిగ్గజ నటుడు మిథున్ చక్రవర్తికి కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ట్విట్టర్ ద్వారా ప్రకటన చేశారు. అక్టోబర్ 8న 70వ జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రదానం సందర్భంగా మిథున్ చక్రవర్తికి ఈ అవార్డ్ ప్రదానం చేయనున్నారు. ఆయనకు ఫాల్కే అవార్డ్ నేపథ్యంలో సినీ ప్రముఖులు, అభిమానులు మిథున్ చక్రవర్తికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
16 జూన్ 1950న పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో జన్మించారు మిథున్ చక్రవర్తి. 1976లో మృగాయ అనే సినిమాతో చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చారు. బెంగాలీతో పాటు బాలీవుడ్లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గానూ నటించారు. తెలుగు, కన్నడ, ఒరియా, భోజ్పురి చిత్రాల్లోనూ కనిపించారు. పవన్ కళ్యాణ్ - విక్టరీ వెంకటేష్ నటించిన గోపాల గోపాలలో స్వామిజీగా తెలుగువారిని పలకరించారు. తర్వాత మలుపు అనే మరో టాలీవుడ్ చిత్రంలోనూ కనిపించారు. ఈ ఏడాది ఇప్పటికే పద్మభూషణ్ అవార్డ్ను కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.
Mithun Da’s remarkable cinematic journey inspires generations!
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) September 30, 2024
Honoured to announce that the Dadasaheb Phalke Selection Jury has decided to award legendary actor, Sh. Mithun Chakraborty Ji for his iconic contribution to Indian Cinema.
🗓️To be presented at the 70th National…


Click it and Unblock the Notifications











