‘దమ్ము’ లీగల్ నోటీసులు- వాళ్ళకి ఇక ఇత్తడే...!
దమ్ము చిత్రం పైరసీని అరికట్టడానికి ఆ చిత్ర నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్.... మద్రాసు హైకోర్టు నుంచి ముదస్తు లీగల్ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీస్ ప్రకారం దమ్ము చిత్రాన్ని ఎవరు పైరసీ చేసినా వారిపై చర్యలుంటాయి. అంతేకాదండోయ్ ఇంటర్నెట్ ఉంది కదా అని...నెట్ నుంచి పైరసీ వెర్షన్ను డౌన్లోడ్ చేసుకున్నా....పైరసీ సీడీలు కొన్నా ఇత్తడయిపోద్ది. సో...బీ కేర్ఫుల్, పొరపాటున కూడా వాటి జోలికి వెళ్లకండి.
ఇది వరకు ధనుష్ నటించిన '3' సినిమా విషయంలో ఇలాంటి జాగ్రత్తలే తీసుకుని సినిమా పైరసీ కాకుండా జాగ్రత్త పడ్డారు. దమ్ము విషయంలో కూడా ఇది సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు. నిర్మాత వల్లభ ఇప్పటికే అభిమానులకు, ప్రేక్షకులకు పైరసీని అడ్డుకోవాలని, చట్టవిరుద్దమైన అలాంటి వాటిని ప్రొత్సహించవద్దని విన్నవించారు.
బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈచిత్రం నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన మాస్ హిట్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు బోయపాటి శ్రీను తనకు అపజయం ఎరుగదని మరోసారి నిరూపించుకున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్కు ప్రేక్షకులు, అభిమానులు నీరాజనాలు పలుకుతున్నారు.
ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన త్రిష, కార్తీక నటించారు. రెండు వంశాల మధ్య గొడవ నేపథ్యంలో దమ్ము చిత్రం సాగుతుంది. జూ ఎన్టీఆర్ విజయ ధ్వజ సింహగా సీరియస్ క్యారెక్టర్లో, రామచంద్రగా ఫన్నీ క్యారెక్టర్లో అలరించారు. దమ్ము జూ ఎన్టీఆర్ సినిమాల్లో ఓ మైలురాయిగా నిలుస్తుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











