దాసరి కోపం ఏ హీరోపైన?
ప్రముఖ దర్శకులు, కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు ప్రసన్నంగా ఉంటే ఎంత మెత్తగా మాట్లాడతారో.. కోపం వస్తే అంత పరుషంగా, పదునుగా ఉంటుంది ఆయన భాష. రెండు రోజుల కిందట బొమ్మరిల్లు 50 రోజుల సెలబ్రేషన్ జరిగినప్పుటు ముఖ్య అతిథులుగా దాసరితో పాటు ప్రముఖ నిర్మాత రామానాయుడు, నిర్మాత-వ్యాపారవేత్త సి.సి.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ వంద చిత్రాలు రూపొందించిన దర్శకరత్న దాసరి నుంచి కొత్తతరం దర్శకులు నేర్చుకోవాల్సింది చాలా ఉందని, అందుకే ఆయన సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. నిర్మాత డి. రామానాయుడు మాట్లాడుతూ ఇలాంటి చిత్రాలు తీసి వరుస విజయాలు సాధిస్తున్న దిల్ రాజు ఇదే పంథాను కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ సమయంలో దాసరి నారాయణ రావు ప్రసంగిస్తూ.. అగ్ర హీరోలపై చురకలు విసిరారు.
తెలుగు చిత్రపరిశ్రమకు 75 సంవత్సరాల చరిత్ర ఉందని, ఎంతోమంది మహానుభావులు ఎన్నో వ్యయప్రయాసల కోర్చి ఈ పరిశ్రమను ఈ స్థాయికి తీసుకువచ్చారని దాసరి అన్నారు. ఈరోజు నలుగురు హీరోలు ఉన్నత స్థానంలో ఉన్నాం కదాని.. చిత్ర పరిశ్రమను డిక్టేట్ చేయాలనుకుంటే సాధ్యం కాదని చురక అంటించారు. తెలుగులో అగ్రహీరోల పోకడలు కారణంగా చిన్న సినిమా దెబ్బతినకూడదని సూచించారు. చిత్రపరిశ్రమలో అందరూ బతకాలని, ఏ కొందరి కోసమో చిత్ర పరిశ్రమ బలి కారాదని అన్నారు. కొందరు హీరోలు తమకు ఫలానా థియేటర్ కావాలని డిస్ట్రిబ్యూటర్లను ఒత్తిడి చేయడం దారుణం అన్నారు. గతంలో తాను ఎన్టీఆర్తో తీసిన సర్దార్ పాపారాయుడు చిత్రం విజయవాడ హక్కులను తీసుకోవాల్సి వచ్చిందని, అయితే అప్పట్లో థియేటర్లు దొరక్క శ్రీవేంకటేశ్వర థియేటర్లో చిత్రాన్ని తాను స్వయంగా విడుదల చేశానన్నారు. కొందరు ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి - ఎప్పుడు రెండో థియేటర్గా ఉండిన ఆ థియేటర్లో మీ సినిమా రిలీజ్ చేశారంటూ ఎన్టీఅర్ వద్ద తన మీద చెడుగా ఎక్కించడానికి ట్రై చేసిన వారికి ఎన్టీఆర్ ఒక్కటే చెప్పారు. ఒక్కసారి సినిమా పూర్తయ్యాక దాని రిలీజ్తో నాకు సంబంధం లేదన్నారు ఎన్టీఅర్. దటీజ్ లెజెండ్ ఎన్టీఆర్. ఆయనే ఆ మాటంటే.. ఇప్పటి హీరోలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదని దాసరి అన్నారు.
ఈ కార్యక్రమంలో దాసరి నారాయణరావు జనరల్గా మాట్లాడారా? లేక హీరోలపై నిజంగానే కోపంతో మాట్లాడారా అనే సంశయం ఇండస్ట్రీ వర్గాల్లో తలెత్తింది. ఇటీవలికాలంలో సిరి మీడియా పతాకంపై కొన్ని చిత్రాల నిర్మాణాన్ని, అలాగే సినిమాల డిస్ట్రిబ్యూషన్ని దాసరి నారాయణరావు చేపట్టారు. జై చిరంజీవ, బాస్ నైజాం హక్కులను దాసరి సొంత సంస్థ భారీ సొమ్ముతో కొనుగోలు చేసిందని కూడా తెలిసింది. అయితే, జై చిరంజీవ ఆడలేదు. బాస్ కూడా జనాన్ని పెద్దగా మెప్పించలేకపోతోందని టాక్ వినవస్తోంది. ఈ డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలలోనే ఎక్కడో దాసరికి కోపం తెప్పించే సంఘటన జరిగిందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications