వెంటిలేటర్పై దాసరి.. చికిత్సకు స్పందిస్తున్నారు..
కొద్దికాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతోన్న ఆయన ఈ ఉదయం ఐసీయూలో చేరారు.
హైదరాబాద్: ప్రఖ్యాత టాలీవుడ్ దర్శకుడు, దర్శకరత్న దాసరి నారాయణరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు హైద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. కొద్దికాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతోన్న ఆయన ఈ ఉదయం ఐసీయూలో చేరారు.
అయితే మంగళవారం మధ్యాహ్నం కిమ్స్ హాస్పిటల్ వర్గాలు విడుదల చేసిన బులెటిన్ లో దాసరికి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని పేర్కొన్నారు.
ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి సానుకూలంగా ఉందని వైద్యులు తెలిపారు. మధ్యాహ్నం వేళ ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు మీడియాలో బ్రేకింగ్ న్యూస్ రావడంతో అభిమానులు, పరిశ్రమ వర్గాలు ఆందోళనకు గురవుతున్నారు.
చిరంజీవి 150వ సినిమా 'ఖైదీనంబర్ 150' వేడుకకు కూడా దాసరి హాజరైన సంగతి తెలిసిందే. ఆయన ఆకస్మికంగా అస్వస్థతకు గురవ్వడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

తన కెరీర్ లో ..అనేక సూపర్హిట్ చిత్రాలను తెరకెక్కించిన దాసరి నారాయణరావు అత్యధిక చిత్రాల దర్శకుడిగా గిన్నిస్ రికార్డు సాధించిన సంగతి తెలిసిందే. ఆయన దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 53 సినిమాలను స్వయంగా నిర్మించారు.
తెలుగు, తమిళం, కన్నడ భాషా చిత్రాలలో నటించారు. రాజకీయాలలోను దాసరి నారాయణరావు చురుగ్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ముద్రగడ పద్మనాభం చేపట్టిన కాపుల రిజర్వేషన్ ఉద్యమానికి కూడా దాసరి మద్దతు పలికారు.


Click it and Unblock the Notifications











