కులం పై దాసరి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: ఎప్పుడూ ఏదో వ్యాఖ్యలు చేసి దుమారం రేపే దాసరి నారాయణ రావు తాజాగా ..మరో సంచలనానికి తెరతీసారు. రఘుపతి వెంకయ్య నాయుడి ఆడియో ఫంక్షన్లో దర్శకరత్న దాసరి నారాయణరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు పేరు కుదింపుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు ఇప్పుడు రఘుపతి వెంకయ్యకే పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఎన్ రెడ్డి పురస్కారానికి లేని కులం పేరు... రఘుపతి వెంకయ్య అవార్డుకు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు.
అలాగే ''దాదా సాహెబ్ ఫాల్కే కంటే ముందే సినిమాని ప్రజలకు అందించిన మహోన్నత వ్యక్తి రఘుపతి వెంకయ్య నాయుడు. మన దేశంతో పాటు బర్మా (మయన్మార్), సిలోన్(శ్రీలంక)లలో టెంట్లు వేసి మరీ ఆయన సినిమాలని ప్రదర్శించారు'' అన్నారు ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు.

గురువారం రాత్రి జరిగిన 'రఘుపతి వెంకయ్య నాయుడు' చిత్రం పాటల ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నరేష్, వాహిని ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. బాబ్జీ దర్శకత్వం వహించారు. మండవ సతీష్బాబు నిర్మాత. శ్రీవెంకట్ స్వరాలు సమకూర్చారు. ప్రముఖ గాయని రావు బాలసరస్వతి తొలి సీడీని ఆవిష్కరించారు. కృష్ణవేణి, విజయనిర్మల స్వీకరించారు. అనంతరం
దాసరి నారాయణరావు మాట్లాడుతూ ''ఇప్పటికీ మనలో చాలామందికి రఘుపతి వెంకయ్య నాయుడు అంటే ఎవరో తెలియదు. భారతీయ సినీ పరిశ్రమ కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి ఆయన. ఫాదర్ ఆఫ్ ది సౌతిండియన్ సినిమాగా ఆయన్ని గుర్తించాల్సి ఉంది. కానీ ఈ గుర్తింపు ఆయనకు లభించలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చాలా ఆలస్యంగా మేల్కొంది. హైదరాబాద్లోని ఫిల్మ్నగర్ని రఘుపతి వెంకయ్యనాయుడు ఫిల్మ్నగర్గా మార్చాలి. దీనికోసం ఫిల్మ్నగర్ సొసైటీకి, ప్రభుత్వానికి విన్నవిస్తాం. భారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకొన్న ఈ సంవత్సరంలో రఘుపతి వెంకయ్య నాయుడు పేరుతో సినిమా రావడం గొప్ప విషయం. ఇది తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉన్నంతకాలం నిలిచిపోయే సినిమా. దీనికి ప్రభుత్వం అన్నిరకాల రాయితీలు కల్పించాలి'' అన్నారు.
ప్రముఖ నటులు కృష్ణ మాట్లాడుతూ ''రఘుపతి వెంకయ్య జీవితాన్ని సినిమాగా తీయాలనుకోవడం ఆనందించదగ్గ విషయం. బాబ్జీ కథని తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది. నరేష్ చక్కటి నటనను కనబరిచాడ''న్నారు.

నరేష్ మాట్లాడుతూ ''మా అమ్మగారు విజయనిర్మల గతంలో రఘుపతి వెంకయ్య అవార్డు అందుకొన్నారు. ఆ అవార్డు చూశాక ఆయన గురించి పూర్తిగా పరిశోధించి మిత్రుడు బాబ్జీతో ఈ సినిమా తీస్తున్నాం. ఈ సినిమా చూసి మా అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. కృష్ణ, దాసరి గారు అభినందించార''న్నారు.
ఉత్తరాదిలో దక్షిణాది సినిమావాళ్లది సెకండ్ గ్రేడ్ బతుకులేనని దాసరి నారాయణరావు వాపోయారు. తరచుగా సంచలన వ్యాఖ్యలు చేయడం ఆయనకు అలవాటుగా మారింది. తాజాగా అవార్డులపై దాసరి చేసిన వ్యాఖ్యలు ఎటువంటి సంచలనాలు సృష్టిస్తాయో చూడాలి. ఈ కార్యక్రమంలో కె.విశ్వనాథ్, వి.బి.రాజేంద్రప్రసాద్, కైకాల సత్యనారాయణ, బాలయ్య, కె.రాఘవ తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











