'చింతకాయల రవి'తో నష్టపోతున్నా: నిర్మాత బుజ్జి

ఈ విషయమై సంస్థ కార్యాలయంలో జరిపిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. "వెంకటేష్ హీరోగా లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై యోగేష్ దర్శకత్వంలో మేం నిర్మించిన 'చింతకాయల రవి' సినిమాను అందరూ చాలా బాగా వుందని మెచ్చుకుంటున్నారు. జనం కూడా బాగా వస్తున్నారు. అమెరికా నేపథ్యం, తల్లీకొడుకుల అనుబంధం ఉండటంతో మహిళలూ మెచ్చుకొంటున్నారు. మేం అడగ్గానే వచ్చి ఓ పాటలో కనిపించిన ఎన్టీఆర్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆ పాట కూడా అందరికీ నచ్చింది.
రిలీజైన రెండు వారాల్లో మేం అనుకున్న దాని కంటే 1.40 లక్షల మంది ప్రేక్షకులు ఎక్కువ ఈ సినిమాకి వచ్చారు. అయితే రాబడి మాత్రం ఆ స్థాయిలో లేదు. సుమారు రూ.3.5 కోట్లు తగ్గింది. కారణం టిక్కెట్ ధరను పెంచుకొనే వీలు లేకపోవడమే. తగ్గిన సొమ్ము ఎటు వెళ్లిందీ..? బ్లాక్లో టిక్కెట్లు అమ్ముకొనేవాళ్లు, పైరసీదార్లు లాభపడ్డారు.
మా సినిమా విడుదలైన వారానికే పైరసీ డీవీడీలు వచ్చేశాయి. ఒక్కో డీవీడీని ముప్ఫై రూపాయలకు అమ్మేస్తున్నారు. అందులో నా సినిమాతోపాటు శౌర్యం, కొత్త బంగారులోకం ఉంటున్నాయి. మరి చలనచిత్ర వాణిజ్య మండలిలో ఉన్న యాంటీ పైరసీ సెల్ ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. మా 'చింతకాయల రవి'కి సంబంధించే ఇంతవరకు 40 కేసులు పెట్టాం. ఆ కేసులకు కూడా మేమే తిరగాలి. పైగా పట్టుబడినవాళ్లు రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని, వెంటనే బయటకు వచ్చేస్తున్నారు. నిన్న (15వ తేదీ)నే ఒక వీడియో షాపులో నేను మా సినిమా పైరసీ డీవీడీలను ఒక్కొక్కటి 30 రూపాయల చొప్పున 40 డీవీడీలను తీసుకొచ్చాను. అలాగే ఇంతవరకు ఈ సినిమా పైరసీ డీవీడీలను నాలుగువేలు పట్టుకున్నాం.
మార్కెట్లో ఇంకెన్ని వేలున్నాయో తెలీదు. పైరసీని అరికట్టేందుకు ఏర్పాటుచేసిన పైరసీ సెల్ వల్ల ప్రయోజనం కలగడం లేదు. ప్రభుత్వమే దీనిపై గట్టి చట్టాన్ని తీసుకొచ్చి, దాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి. పైరసీని అరికడితే మా కష్టాలు చాలావరకు తీరుతాయి'' అసలు ఈ పైరసీ నుంచి సినీ పరిశ్రమను కాపాడుకొనేందుకే రెండు వారాలు ధరలు పెంచుకొనేందుకు జీవో తీసుకొచ్చారు. నిజానికి టిక్కెట్ ధరలు ఎక్కువగా వున్నాయనే ఉద్దేశంతో భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించాం అని ఆయన వివరించారు.
గతంలో 'లక్ష్మీ' చిత్రానికి తొలి రెండు వారాలకు రూ.11 కోట్లు వచ్చాయి. మరి ఇప్పుడో.. అంతకంటే ఎక్కువ మంది చూశారు... మూడున్నర కోట్లు మొత్తం తగ్గింది! ధరలు తగ్గడం వల్ల కలిగే నష్టం విషయంలో నిర్మాతలంతా ఏకం కావాలి. మనకేం ఇబ్బంది లేదని ఎవరికి వారే మౌనంగా ఉంటున్నారు. నొప్పి తెలిసినవాణ్ని నేను. పెంచడం, తగ్గించడం అనే జీవోల వెనక కొందరు పెద్దలున్నారు. వారి మధ్య ఉన్న ఇగో సమస్యలతోనే ఇదంతా జరుగుతోంది. దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో తప్ప మరెక్కడా ఇంత తక్కువ ధరకు సినిమా టిక్కెట్లు విక్రయించడం లేదు. బీహార్, అసోమ్ల్లో కూడా రూ.80 వరకూ టిక్కెట్ని విక్రయిస్తున్నార''న్నారు.
టిక్కెట్ ధరలు తగ్గడం మూలంగా పారితోషికాలు తగ్గే అవకాశం ఉందా? అని ప్రశ్నిస్తే ''అది చాలా కష్టం. ఎవరూ తమ పారితోషికాల్ని తగ్గించుకొనేందుకు సిద్ధంగా లేరు. పైగా అన్నింటి ధరలూ పెరిగిపోయిన నేపథ్యంలో చిత్ర నిర్మాణ వ్యయమూ ఆ విధంగానే పెరుగుతూ ఉంటుంది... సినిమా టిక్కెట్ తప్ప!'' అన్నారు. ఈ విషయంలో తాము రాష్ట్ర ముఖ్యమంత్రికి ఓ విజ్ఞాపన పత్రం కూడా అందించామన్నారు బుజ్జి. ''అందులో పై తరగతుల ధరల్ని కనీసం పది రూపాయల మేరకు పెంచమన్నాం. అలా చేసినా కొంత మేరకు కలిసొచ్చేద''న్నారు.


Click it and Unblock the Notifications











