Mega Blockbuster దీపిక, రష్మికతో రోహిత్ శర్మ.. ఏం జరగబోతుంది? ఫ్యాన్స్లో ఉత్కంఠ..!
దేశంలో వినోదానికి కేరాఫ్ అడ్రెస్ సినిమాలు లేదా క్రికెట్. కాస్త సమయం దొరికితే ఏదైనా సినిమా చూడటం లేదా మ్యాచ్ను వీక్షిస్తుంటారు ప్రేక్షకులు. ఈ రెండింటికి ఉన్న ప్రత్యేకతే వేరు. అందుకే క్రికెటర్లకు కానీ సినీతారలపై కానీ అంతులేని అభిమానం చూపిస్తుంటారు ఫ్యాన్స్. ఏదైనా పెద్ద సినిమా రిలీజైనా, ఐపీఎల్ లాంటి క్రేజీ ఈవెంట్ షురూ అయినా.. సందడి మామూలుగా ఉండదు. అయితే విడివిడిగా క్రికెట్, సినిమా ఎంత ఎంటర్టైన్ చేసినా.. ఆ రెండూ కలిస్తే వచ్చే మజానే వేరు. అలాంటి ఓ కార్యక్రమానికే శ్రీకారం జరిగినట్లు తెలుస్తోంది. అదే మెగా బ్లాక్బస్టర్.

గతంలో జరిగినా.. తేడా ఏంటంటే..
అయితే సినిమా, క్రికెట్ కలవడం గతంలోనూ జరిగింది. సీసీఎల్ లాంటి ఈవెంట్లలో ఒకప్పుడు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి అగ్రకథానాయకులతో పాటు ఇతర హీరోలు కూడా అభిమానులకు వినోదాన్ని పంచారు. ఇక ఐపీఎల్ వంటి క్రికెట్ ఈవెంట్ల ప్రారంభోత్సవాలు, ముగింపు వేడుకల్లోనూ సినీతారలు సందడి చేస్తూ.. ఉత్సాహాన్నిస్తారు. అయితే ఆ వేడుకల్లో సినీతారలు, క్రికెటర్లు కలిసి పాల్గొన్నది లేదు. దీంతో మెగా బ్లాక్బస్టర్ వినూత్న ప్రాజెక్టు అని చెప్పొచ్చు.

అటు దీపిక, రష్మిక.. ఇటు రోహిత్, దాదా..
ఏదైనా ఈవెంట్లో కానీ సినిమాలో కానీ ఒకరికి మించి ఎక్కువ మంది సెలబ్రిటీలను చూస్తే అభిమానులకు కన్నులపండుగే. వాటికోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక అందులో క్రికెటర్లు సైతం పాల్గొంటే.. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం. అలాంటి ప్రాజెక్టే ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రానుంది. దానికోసం బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొణె నుంచి దక్షిణాది తారలు త్రిష, కార్తీ, రష్మిక వరకు జట్టుకట్టనున్నారు. ఇక టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా ఇందులో పాలుపంచుకోనున్నారు.

సర్ప్రైజ్ అంటున్న దీపిక..
ఈ విషయాన్నే వెల్లడిస్తూ శుక్రవారం ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ చేసింది దీపిక. సర్ప్రైజ్ అంటూ అభిమానులను ఊరిస్తోంది. మెగా బ్లాక్బస్టర్.. ట్రైలర్ సెప్టెంబర్ 4న విడుదల కానుందని తెలిపింది. రష్మిక కూడా గురువారమే ఈ ప్రాజెక్టు గురించి వెల్లడించింది. ఇందులో చాలా ఫన్ ఉందంటూ క్యాప్షన్ ఇచ్చింది. దానికోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పింది.

కపిల్ శర్మ ఉండగా.. హాస్యానికి ఢోకా ఉండదుగా..
ఇక హిందీలో పాపులర్ కమెడియన్ కపిల్ శర్మ, త్రిష, కార్తీ కూడా ఈ ప్రాజెక్టులో పాల్గొంటున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్లను తమ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి ఫ్యాన్స్లో క్యూరియాసిటీ పెంచుతున్నారు. ఈ విజువల్ ట్రీట్ కోసం అందరూ సెప్టెంబర్ 4 కోసం వేచిచూడాలని వారు పేర్కొన్నారు.

అరంగేట్రం అంటున్న హిట్మ్యాన్..
ఈ ప్రాజెక్టు గురించి ప్రకటిస్తూ షూటింగ్లో పాల్గొనడం ఎంతో సంతోనిచ్చిందని అన్నారు గంగూలీ. త్వరలోనే ఇది ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. ఇక రోహిత్ శర్మ సైతం.. మెగా బ్లాక్బస్టర్పై చేసిన పోస్ట్ వైరల్గా మారింది. హిట్మ్యాన్ సినిమాల్లో నటిస్తున్నాడా.. అనే ఊహాగానాలకు స్వయంగా అతనే తెరలేపాడు. అందుకు తగ్గట్టుగానే "ఇది అరంగేట్రం లాంటిది" అని ఆ ఫొటో కింద రాసుకొచ్చాడు టీమ్ఇండియా కెప్టెన్. దీనికోసం ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు చెప్పాడు. అన్నట్టు ఫొటోలో సాధారణ మధ్యతరగతి వ్యక్తిలా హాఫ్ స్లీవ్స్ షర్ట్లో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేందుకు రోహిత్ సిద్ధమవుతున్నట్లు ఉంది.
ఇంతమంది స్టార్స్ని ఒకే వేదికపై చూడటం కచ్చితంగా ఫ్యాన్స్కు అదిరిపోయే ట్రీట్ అని చెప్పొచ్చు. అయితే ఈ మెగా బ్లాక్బస్టర్ అనేది ఏదైనా షోనా? సిరీస్ లేదా వీడియోనా? అనేది తెలియాల్సి ఉంది. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఆదివారం వరకు వేచిచూడాల్సిందే.


Click it and Unblock the Notifications











