ప్రతిఒక్కడు అభిమాని కాదు: మోహన్ బాబు, చిరుపై పుకారే!
హైదరాబాద్: విష్ణు, హన్సిక హీరో హీరోయిన్లుగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అరియానా-వివియానా(విష్ణు కుమార్తెలు) సమర్పణలో మోహన్ బాబు నిర్మిస్తున్న చిత్రం 'దేనికైనా రెడీ'. చక్రి, యువన్ శంక్ రాజా ఈచిత్రానికి సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం ఆడియోకు చిరంజీవి హాజరవుతున్నారంటూ రెండు రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే చిరంజీవి హాజరవుతున్నాడన్న వార్త వట్టి పుకారే అని తేలి పోయింది. శుక్రవారం సాయంత్రం జరిగిన 'దేనికైనా రెడీ' ఆడియో వేడుకకు చిరంజీవి హాజరు కాకపోవడంతో ఈ విషయం స్పష్టమైంది.
ఆడియో వేడుక విశేషాల్లోకి వెళితే... 'దేనికైనా రెడీ' చిత్రం ఆడియో గాంధర్వ మహల్ సెట్లో శుక్రవారం జరిగింది. లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేసిన అభిమానులచే ఈ చిత్రం పాటలు విడుదల చేయించారు. డాక్టర్ బ్రహ్మానందం సిడీలను ఆవిష్కరించి పద్మశ్రీ మోహన్ బాబుకు అందజేసారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ సినిా చూసే ప్రతి ఒక్కడు అభిమాని కాదు. ఒక హీరో సినిమా విడుదలవుతుంది అంటే థియేటర్ల దగ్గర రాత్రింభవళ్లు కష్టపడి కరెంటు స్థంబాలు సైతం ఎక్కి ఆ హీరో కటౌట్లు, బ్యానర్లు కట్టే వ్యక్తులు, వాళ్ల పనులను సైతం వదులుకుని ఇలాంటి వేడుకలకు వచ్చే వారే నిజమైన అభిమానులు. అలాంటి అభిమానులను నేను సంపాదించుకున్నందుకు చాలా గర్వంగా ఉంది. అందుకే అభిమానులతో ఆడియో విడుదల చేయించాం అని తెలిపారు.
విష్ణు మాట్లాడుతూ 'దేనికైనా రెడీ' చిత్రం డిఫరెంటుగా ఉంటుంది. రికార్డులు బద్దలు కొడుతుందని అనను కానీ... మంచి హిట్ అవుతుందనే కాన్ఫిడెంట్ గా చెప్పగలను. చక్రితో ఇది నా మూడవ సినిమా. యువన్ శంకర్ రాజా రెండు పాటలు చేయమని అడగ్గానే ఒప్పుకున్నాడు. ఢీ తర్వాత ఈ సినిమాకు చాలా ఎంజాయ్ చేసాను అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ... విష్ణులో మంచి కామెడీ టైమింగ్, పెర్ఫార్మెన్స్ నాకు బాగా నచ్చాయి. మోహన్ బాబులో ఉండే నవరసాలు అతనిలో ఉన్నాయి. కొన్ని షాట్స్ లో అతన్ని చూస్తే మోహన్ బాబు కనిపిస్తారు. డాన్స్ లో తండ్రిని మించి పోయాడు. విష్ణుకు సూపర్ హిట్ రావాలని యూనిట్ సభ్యులంతా కష్టపడి పని చేసారు. మా కష్టానికి తగిన ఫలితం దక్కుతుందని ఆశిస్తున్నాము అని తెలిపారు.


Click it and Unblock the Notifications











