‘దేనికైనా రెడీ’లొల్లిపై తీర్పు వెలువరించిన హైకోర్టు
హైదరాబాద్ : మంచు విష్ణు హీరోగా రూపొందిన 'దేనికైనా రెడీ' చిత్రంపై ఆ మధ్య వివాదం నెలకొన్ని సంగతి తెలిసిందే. సినిమాలో బ్రాహ్మణులను కించపరిచే విధంగా సీన్లు ఉన్నాయని రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణులు ఆందోలన చేయడంతో పాటు, సినిమాను నిషేదించాలని కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ కేసుకు సంబంధించిన హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. సినిమాలోని రెండు అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని కోర్టు ఆదేశించింది. రెండు సన్నివేశాలను సినిమా మొత్తానికి ఆపాదించలేం, నిషేదం సరికాదని కోర్టు అభిప్రాయ పడింది. సినిమా కథాంశాన్ని చూడాలే కానీ సన్నివేశాలను, దృశ్యాలను పరిగణలోకి తీసుకోవద్దని కోర్టు పేర్కొంది.
ఏమైనా అభ్యంతరాలు ఉంటే కోర్టులను ఆశ్రయించాలే తప్ప, దాడులు చేయడం సరికాదని కోర్టు పిటిషనర్ను మందలించింది. కోట్లు వెచ్చించి సినిమాలు నిర్మించే నిర్మాతలు జాగ్రత్తలు తీసుకోవాలని, సినిమాలు ప్రేక్షకులను అలరించే విధంగా ఉండేలే తప్ప...ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదని సూచించింది.
'దేనికైనా రెడీ' చిత్రానికి జి నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించారు. మంచు విష్ణు, హన్సిక జంటగా రూపొందిన ఈచిత్రాన్ని 24 ఫ్రేమ్స్ పతాకంపై మోహన్ బాబు నిర్మించారు. గోపీ మోహన్, కోన వెంకట్, బివిఎస్ రవి స్క్రీన్ ప్లే అందించారు. అక్టోబర్ 24, 2012లో విడుదలైన ఈచిత్రం మంచి విజయం సాధించింది.


Click it and Unblock the Notifications












