దేవీశ్రీప్రసాద్కు దక్కిన చివరి చూపు
హైదరాబాద్ : సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ బాపును చివరిసారిగా చూసేందుకు ఉరుకులు పరుగులమీద వచ్చారు. బాపు మృతదేహాన్ని విద్యుత్తు చితిమీదకు చేర్చే దశలో చితిపై పూలమాల వేసి నివాళులర్పించారు.
మంగళవారం చెన్నైలో బాపు పార్ధివ దేహానికి సినీ, రాజకీయరంగ ప్రముఖులు, అభిమానులు, కుటుంబ సభ్యులు చివరిసారిగా కన్నీటి వీడ్కోలు పలికారు. బాపు భౌతికకాయానికి మధ్యాహ్నం 1.30 గంటలకు చెన్నైలోని బిసెంట్ నగర్ విద్యుత్తు శ్మశానవాటికలో అంతిమ సంస్కారం నిర్వహించారు. ఆయన అంతిమయాత్రలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

బాపును అమితంగా అభిమానించే గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆయన అంత్యక్రియల్లో పాల్గొనడమే కాకుండా పాడెను కొద్దిసేపు మోశారు. మరికొంతమంది అభిమానులు కూడా పాడెను మోశారు. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, నిర్మాత బోనీకపూర్లు అంత్యక్రియలు పూర్తయ్యే వరకూ శ్మశానవాటికలో ఉండిపోయారు.
మోహన్బాబు మాట్లాడుతూ... నాకు వూహ తెలిసీ 'బాపు, రమణ' లాంటి ప్రాణస్నేహితులను చూడలేదు. మా అబ్బాయి విష్ణుతో బాపు దర్శకత్వంలో ఒక సినిమా చేద్దామనుకున్నాం. ఆ సినిమా చేద్దామంటే ఆయన 'బ్రహ్మ(రమణ)లేడే' అనేవారు. ఈ తరంలో బాపు, రమణ లాంటి వారు ఇంకొకరు రాబోరు. వచ్చే తరంలో ఏమో చెప్పలేం అన్నారు.
అనిల్కపూర్ మాట్లాడుతూ.... నేనీరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అది బాపూ భిక్ష. భారతదేశం గర్వించదగ్గ గొప్ప కళాకారుడాయన. 'పద్మశ్రీ' చాలా ఆలస్యంగా ఇచ్చారు. నిజానికి ఆయన స్థాయికి ఆ అవార్డు చాలా చిన్నది. బాపు సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఆయనకు మరింత పెద్ద గుర్తింపు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి విజ్ఞప్తి చేస్తున్నాను అన్నారు.


Click it and Unblock the Notifications











