అభిమానుల చేతుల్లోనే ఉంది: దిల్ రాజు
హైదరాబాద్ : ''పైరసీని అరికట్టాలంటే అది అభిమానులకే సాధ్యం. అందరి హీరోల అభిమానులు సమష్టిగా పైరసీపై పోరాడితేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది'' అన్నారు దిల్ రాజు. ఆయన హైదరాబాద్లో మీడియాతో ముచ్చటిస్తూ తాము ఎంతో కష్టపడి తీసిన చిత్రాలు ఇలా పైరసీకి గురి అయితే చాలా బాధకలుగుతుందని, అభిమానులంతా కలిస్తే దాన్ని నివారించటం సాధ్యమేనని అన్నారు.
ఇక ''సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' గురించి చెపుతూ... ఈ చిత్రానికి విడుదలైన ప్రతిచోట మంచి స్పందన లభిస్తోంది. వసూళ్లపరంగా కూడా రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమాని పైరసీ చేయబోతున్నారనే సమాచారం అందింది. అందుకే ప్రతి జిల్లాలోనూ మా ప్రతినిధుల్ని ఏర్పాటుచేసి పైరసీదారులపై నిఘా పెట్టాము''అన్నారు.
ఎవరికివారు ఇలా ఒంటరిగా పైరసీపై పోరాడటం ఎంతవరకూ సరైందని మీడియా వారు అడగ్గా ''పైరసీ సినీ ప్రపంచానికే ఓ సమస్యగా తయారైంది. మాకు సమస్య వచ్చింది కాబట్టి మేము స్పందిస్తున్నాం. వాణిజ్యమండలి కూడా పైరసీ నివారణకు కృషిచేస్తుంది. ఈ బృందం ఇటీవల విడుదలైన 'నాయక్' సినిమా పైరసీదారులపై కూడా దృష్టిపెడుతుంది''అన్నారు.
''నిర్మాతగా నాకెంతో సంతృప్తినిచ్చిన సినిమా 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు'. తొలిరోజు నుంచే కుటుంబ ప్రేక్షకుల ఆదరణ ఈ సినిమాకు లభించడం ఆనందంగా ఉంది'' అని అన్నారు. వెంకటేష్, మహేష్ హీరోలుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం శుక్రవారం విడుదలైంది.
''ఈ సినిమాకు లభిస్తున్న ప్రశంసలు మరిచిపోలేనివి. ఈ క్రెడిట్ మొత్తం వెంకటేష్, మహేష్లదే. వారిచ్చిన సహకారం వల్లే సినిమాను దిగ్విజయంగా పూర్తి చేయగలిగాం. చాలా రోజుల తర్వాత థియేటర్ల నిండా కుటుంబ ప్రేక్షకులు కనిపిస్తున్నారు. చాలామంది సినిమా చూసి భావోద్వేగానికి గురవు తున్నారు. '' అని తెలిపారు దిల్ రాజు.


Click it and Unblock the Notifications











