Balagam: చిక్కుల్లో దిల్ రాజు.. నా కథను కాపీ కొట్టారు.. చర్యలు తీసుకోవాలి: జర్నలిస్ట్ సతీష్
జబర్దస్త్ కమెడియన్ టిల్లు వేణు దర్శకుడిగా మారిన చిత్రం బలగం (Balagam Movie). కమెడియన్ ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్ సంస్థ నిర్మించింది. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు బాగా పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా పల్లెటూరు, పొట్టి పిల్ల వంటి పాటలకు మంచి ఆదరణ వచ్చింది. శ్యామ్ కాసర్ల సాహిత్యం, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో బాణీలకు మంగ్లీ, రామ్ మిరియాల గాత్రం తోడు కావడంతో హిట్ గా నిలిచాయి. తాజాగా మరోసారి ఈ సినిమా విషయంలో నిర్మాత దిల్ రాజ్ చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. మార్చి 3న విడుదలైన బలగం సినిమా కాపీ వివాదంలో చిక్కుకున్నది. ఈ వివాదంలోకి వెళితే..

విమర్శకులు సైతం..
అంతేకాకుండా సిరిసిల్లలో జరిగిన బలగం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకు తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ముఖ్య అతిథిగా హాజరు కావడంతో ఈ సినిమాపై బజ్ క్రియేట్ అయింది. ఇక ఈ సినిమా మార్చి 3న థియేటర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే రెండు రోజులకు ముందు ప్రీమియర్ షోలు వేశారు. ఈ సినిమాకు మంచి రివ్యూలు, పాజిటివ్ టాక్ తో విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉంటే ఈ సినిమా కథ విషయంలో వివాదం నెలకొంది.

కథకు మూలం ఏంటీ..
ప్రముఖ తెలంగాణ దినపత్రికలో పనిచేసే జర్నలిస్ట్ గడ్డం సతీష్.. బలగం సినిమా కథ తనదేనని అంటున్నారు. 2011లో తాను రాసిన 'పచ్చికి' కథను బలగం పేరుతో కాస్తా చిన్న మార్పులు చేసి తెరకెక్కించారని చెబుతున్నారు. ఈ వివాదంపై గడ్డం సతీష్ మాట్లాడారు. "ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్ర కథలతో సినిమాలు చేసి కమర్షియల్ సక్సెస్ సాధించిన వ్యక్తి దిల్ రాజు. ఇప్పుడు తెలంగాణపై పడటం అనేది మంచి విషయమే అయితే ఆయన సినిమాలు చేసేటప్పుడు ఆ కథకు మూలం ఏంటనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది" అని ఆయన అన్నారు.

తెలంగాణ మాండలికంలో..
ఇంకా సతీష్ కొనసాగిస్తూ.. "నేను రాసిన పాత కథను తీసుకుని దాన్ని కొంత మార్చి బలగం అనే టైటిల్ పెట్టి సినిమా చేయడమనేది చాలా సిగ్గు చేటు. 2011లోనే నేను పచ్చికి కథ రాశాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ యాస నిరాదారణకు గురైంది. తెలంగాణలో మాట్లాడితే ఈసడించుకునేవారు. నేను తెలంగాణ మాండలికంలో కథ రాసినప్పుడు ఆంధ్ర పత్రికలు కథను అచ్చు వేయలేమని చెప్పి తీసి పడేశారు. 2011 నుంచి తెలంగాణ మాండలికంలోనే కథలు రాస్తూ వచ్చాను" అని తెలిపారు.

మనిషి మరణించిన తర్వాత..
"ఈ పచ్చికి కథ కారణంగానే నాకు నమస్తే తెలంగాణ పత్రికలో ఉద్యోగం కూడా వచ్చింది. 2011లో రాసిన పచ్చికి కథను 2014లో నమస్తే తెలంగాణలోని బతుకమ్మలో (సండే బుక్) అచ్చు వేశారు. పచ్చికి అంటే పక్షికి అనే అర్థం. సాధారణంగా మనుషులు చనిపోతే పక్షులకు ఆహారం పెడతారు. అది సాధారణంగా జరిగే విషయమే. మనిషి మరణించిన తర్వాత మూడో, ఐదో, ఏడో రోజు పక్షికి ముద్ద పెడతారు. పక్షికి పెట్టేదాన్ని పచ్చికి అనే కథగా రాశాను" అని జర్నలిస్ట్ సతీష్ చెప్పుకొచ్చారు.

90 శాతం కథ నాదే..
"బలగం సినిమా ప్రీమియర్ కు వెళ్లినప్పుడు ఈ సినిమాలోని కొమురయ్య పాత్ర నా కథలో రాయమల్లయ్యగా రాశాను. ఇది మా మానకొండ కథ. నా కళ్ల ముదు జరిగిన కథ. ఇప్పుడు దాన్నే దిల్ రాజు గారు బలగం టైటిల్ తో సినిమా తీసి డబ్బులు సంపాదించుకునేందుకు నాటకం ఆడుతున్నారు. నేను సినిమా చూసే మాట్లాడుతున్నాను. 90 శాతం కథ నాదే. మిగిలిన 10 శాతమే చిన్న చిన్న మార్పులు చేశారు. అలాంటి మార్పులు సాధారణంగా జరుగుతుంటాయి" అని సతీష్ పేర్కొన్నారు.

చట్టపరంగా ముందుకు..
"బలగం సినిమా చూసే సమయంలో నేను దర్శకుడు వేణు ఎల్దండిని కలిశాను. కానీ అప్పుడేం మాట్లాడలేదు. సైలెంట్ గా వచ్చేశాను. రైటర్ గా నేను కోరుకునేది ఒకటే. కథకు సంబంధించిన క్రెడిట్ నాకే ఇవ్వాలి. దానికి సంబంధించి దిల్ రాజు గారు చర్యలు తీసుకోవాలి. ఆయన చర్యలు తీసుకోకపోతే నేను చట్టపరంగా ముందుకు వెళ్తాను" అని జర్నలిస్ట్ సతీష్ హెచ్చరించారు.


Click it and Unblock the Notifications











