YS Jagan ప్రభుత్వం చర్చలు.. సమస్యలపై సోషల్ మీడియాలో స్పందించవద్దు: సినీ ప్రముఖులకు దిల్ రాజ్ విన్నపం
ఏపీలో సినిమా పరిశ్రమకు సంబంధించిన సమస్యలు, వివాదాలకు పరిష్కారించడానికి సినీ పరిశ్రమ పెద్దలు సిద్ధమవుతున్నారు. సమస్యల పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం నుంచి సానుకూలమైన సంకేతాలను అందించి కమిటీ ఏర్పాటు చేయాలని సూచించింది. దాంతో టాలీవుడ్లో కమిటీ ఏర్పాటుకు కసరత్తు జరుగుతున్నది. త్వరలోనే ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధమతున్న నేపథ్యంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు కీలక మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ మీట్లో స్రవంతి రవికిషోర్ తదితరులు పాల్గొన్నారు. దిల్ రాజ్ మాట్లాడుతూ..

ఏపీలో సమస్యలకు కమిటీ ఏర్పాటు
ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి మీడియా సమావేశం పెట్టడానికి ప్రధాన కారణం ఏమిటంటే.. టికెట్ల పెంపు వ్యవహారం, థియేటర్ల మూసివేత సంఘటనలపై ఏపీ ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఫిలిం ఛాంబర్, సినీ పరిశ్రమ నిర్మాతలు, డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్ల నుంచి కొంత మందిని కమిటీలోకి తీసుకొంటాం. ఆ కమిటీ సభ్యులు వెళ్లి ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతుంది. ప్రస్తుతం ఉన్న సమస్యల పరిష్కారినికి ఆ కమిటీ కృషి చేస్తుంది అని దిల్ రాజు చెప్పారు.

వ్యక్తిగతంగా ఎవరు రియాక్ట్ కావొద్దు
ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిగే లోపు సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై ఎవరూ కూడా సోషల్ మీడియాలో స్పందించడం, ట్వీట్లు చేయడం మంచిది కాదు. ఒక సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. కమిటీతో చర్చించి వాటిని పరిష్కరిస్తుందని ఆశిస్తున్నాం. కాబట్టి పరిశ్రమ అంతా ఒకటే. కమిటీ చర్చల తర్వాత సమస్యలు పరిష్కారం కాకపోతే, ఇండస్ట్రీలోని చాలా విభాగాలకు చెందిన వారితో సమావేశం ఏర్పాటు చేసి ఏం చేయాలనే విషయంపై మళ్లీ ఓ నిర్ణయానికి వద్దాం. దయచేసి వ్యక్తిగతంగా ఎవరు కూడా రియాక్ట్ కావొద్దు అని దిల్ రాజు అన్నారు.

తెలంగాణ ప్రభుత్వానికి టాలీవుడ్ ధన్యవాదాలు
ఇక సినిమా పరిశ్రమపై సానుకూలంగా తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. టికెట్ రేట్లు ఫైనలైజ్ చేసి కొత్త జీవోను జారీ చేసింది. సినిమా పరిశ్రమ బాగోగులను ఆలోచించి జీవో జారీ చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు, అలాగే సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాం. అలాగే ఏపీ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తే.. సీఎంను, మంత్రిని కలిసేందుకు సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఏపీ ప్రభుత్వం అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాం అని నిర్మాత దిల్ రాజు పేర్కొన్నారు.

మీడియా పాత్ర కీలకం..
ఆంధ్ర ప్రదేశ్లోని సినిమా పరిశ్రమకు సంబంధించిన సమస్యలకు సానుకూలమైన పరిష్కారం లభిస్తుందనే ఆశాభావం నెలకొన్న నేపథ్యంలో మీడియా కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఈ సమస్యల పరిష్కారంలో మీడియా పాత్ర అత్యంత కీలకం. ప్రభుత్వాలకు, సినీ పరిశ్రమకు మీడియా వారధి. సినిమా పరిశ్రమకు సంబంధించిన ప్రతీ ఈవెంట్లో మీడియా తరఫున మీరు ఉంటారు. సినీ పరిశ్రమకు సంబంధించిన సున్నితమైన సమస్యలపై జాగ్రత్తగా స్పందించండి. లేకపోతే చాలా కాంప్లికేట్ అవుతున్నాయి అని దిల్ రాజు సూచించారు.

త్వరలోనే ఏపీ ప్రభుత్వం జీవో
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలను త్వరలోనే కలుస్తాం. తెలంగాణ ప్రభుత్వం స్పందించినట్టుగానే ఏపీ ప్రభుత్వం కూడా సినీ పరిశ్రమకు సానుకూలంగా జీవో జారీ చేస్తుందని ఆశిస్తున్నాం. అదనపు షోలు, టికెట్ రేట్లు, ఎగ్జిబిటర్లకు విద్యుత్ సమస్యలు, ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు సమస్యలు వేర్వేరుగా ఉన్నాయి. కాబట్టి ఆ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాం. కమిటీ ఏర్పాటు చేసి సమస్యలను వారికి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రభుత్వానికి అసలు సమస్యలేమిటనే విషయాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. సినిమా పరిశ్రమకు సంబంధించిన సెన్సిటివ్ విషయాలపై మీడియా జాగ్రత్త వహించాలి. భాధ్యతాయుతంగా రిపోర్టింగ్ చేయాలని కోరుకొంటున్నాం అని దిల్ రాజు తెలిపారు.


Click it and Unblock the Notifications











