ఏ నిర్మాత కూడా సంతోషంగా లేడు...దిల్ రాజు
నిర్మాతలకు కూడా చాలా సమస్యలున్నాయి. ప్రస్తుతం ఏ నిర్మాత కూడా సంతోషంగా లేడు. అందుకే మా సమస్యలు పరిష్కారం అయ్యేదాకా షూటింగ్లు ఆపేస్తున్నాం అని నిర్మాతల మండలి తరుపున ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలిపారు. అలాగే ఇలా ఆపేయటం వల్ల కొన్ని చిత్రాల విడుదలలో జాప్యం కూడా జరుగుతుంది. అయినా పరవాలేదు. సమస్య పరిష్కారం కోసం నష్టమైనా భరించేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతం చిత్రాలు నిర్మిస్తోన్న 28మంది నిర్మాతలతో పాటు, త్వరలో సినిమా నిర్మాణానికి పూనుకోనున్న మరికొద్ది మంది నిర్మాతలు కలసి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
తెలుగు చలన చిత్ర నిర్మాతలకు, ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్కు మధ్య నడుస్తున్న వివాదం మరింత బాగా పెరగటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫైటర్ల తరఫున చర్చలకు రావాలని నిర్మాతలు పిలిచినా... అందుకు ఫెడరేషన్ సభ్యులు తిరస్కరించారు. 'మాకు పాత సమస్యలు కూడా ఉన్నాయి. వాటిని పరిష్కరిస్తామని హామీ ఇస్తేనే వస్తామ'ని కూర్చున్నారు. దీంతో నిర్మాతలు సమావేశమై ఒక నిర్ణయానికొచ్చారు. నిర్మాతలకూ సమస్యలున్నాయి. అవి పరిష్కారమయ్యే వరకు నిర్మాతలు కూడా షూటింగ్లకు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకొన్నారు. దీంతో నిరవధికంగా షూటింగ్లను బంద్ చేశారు. ఈ మీటింగ్ లో డి.సురేష్బాబు, సి.కల్యాణ్, బెల్లంకొండ సురేష్, తేజ, నల్లమలుపు బుజ్జి, ప్రసన్నకుమార్, నట్టికుమార్ తదితరులు పాల్గొన్నారు.
తమ్మారెడ్డి భరద్వాజ, చిన్న సంఘటనను సాకుగా తీసుకుని షూటింగ్స్ నిలిపివేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసారు.గత ఆరేళ్లుగా కార్మికుల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని, వాటి పరిష్కారం కోసం ఫెడరేషన్ పదే పదే చేస్తున్న విజ్ఞప్తులను పరిశ్రమ పెద్దలు పెడచెవిన పెడుతున్నారని, అందువల్ల తమ సమస్యలు పరిష్కారమయ్యేంతవరకు షూటింగ్స్కు హాజరు కారాదని తాము నిర్ణయించుకున్నామని, అయితే ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, కార్మికుల మనుగడ నిర్మాతలతోనే ముడిపడి ఉన్నందున నిర్మాతలతో ఘర్షణను ఫెడరేషన్ కోరుకోవడం లేదని, పరిశ్రమకు పెద్ద దిక్కు అయిన దాసరి నారాయణరావు మాట ప్రకారం తామంతా నడుచుకుంటామని తమ్మారెడ్డి ప్రకటించారు.


Click it and Unblock the Notifications











