ప్రజలకు వేణుస్వామి, ఆరా మస్తాన్ తీరని మోసం.. సర్కారే వేటు వేయాలి.. ప్రముఖ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో టీడీపీ , జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. సీఎంగా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్లు ప్రమాణ స్వీకారం చేయడంతో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అయితే వైసీపీ నేతలు, ఆ పార్టీకి మద్ధతు ఇచ్చిన వారిపై ట్రోలింగ్ ఓ రేంజ్లో జరుగుతోంది. గతంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఇతర కూటమి నేతలపై నోటి దురుసుతో నానాకూతలు కూసిన వైసీపీ నాయకుల ఇళ్లపై ఆయా పార్టీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారు. స్వయంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ను సైతం సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు. మొన్న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు వచ్చిన ఆయనను అసెంబ్లీ ప్రాంగణంలో జగన్ మామయ్య అంటూ హేళన చేయడంతో ఆయన ఇబ్బందిపడ్డారు.
ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీదే విజయమని, జగన్ మరోసారి సీఎం అవుతారని చెప్పిన ఆరా మస్తాన్కు ఫలితాలు షాకిచ్చాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ టీడీపీ కూటమికి అనుకూలంగా ఉంటే ఆరా మస్తాన్ వైసీపీకి 94 నుంచి 104 స్థానాలు .. కూటమికి 71 నుంచి 81 స్థానాలు వస్తాయని చెప్పారు. దీంతో వైసీపీ కేడర్ సంబరాలు చేసుకున్నారు.. గతంలో ఆరా మస్తాన్ చెప్పిన అంచనాలు.. ఫలితాలకు దగ్గరగా ఉండటంతో చాలా మంది ఆయన సర్వేపై నమ్మకంతో వందల కోట్లు పందాలు కాశారు.

తీరా ఓట్ల లెక్కింపు రోజున ఫలితాలు పూర్తి వ్యతిరేకంగా రావడంతో ఆరా మస్తాన్పై కూటమి శ్రేణులు విరుచుకుపడ్డారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓ ఆట ఆడుకున్నారు. వ్యక్తిగతంగానూ , సంస్ధ పరంగాను ఆరా మస్తాన్ ఇప్పుడు జనం నమ్మకాన్ని కోల్పోయారు. అయితే సర్వే ఫలితాలు చెప్పే సమయంలోనే తన అంచనా తప్పే అవకాశం లేదని, లేనిపక్షంలో భవిష్యత్లో సర్వేలు చేయనని ఆరా మస్తాన్ ఛాలెంజ్ విసిరారు. ఇప్పుడు ఈ మాటకు కట్టుబడి ఉండాలని సోషల్ మీడియాలో ఆయనపై ట్రోలింగ్ నడుస్తోంది.
ఇక సెలబ్రెటీ జ్యోతిష్యుడు వేణుస్వామి సంగతి సరే సరి. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి, ఈ ఏడాది ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఓడిపోవడం వివాదాస్పదమయ్యాయి. ఈ రెండూ ఘటనల్లో బీఆర్ఎస్, ఎస్ఆర్హెచ్లు గెలుస్తాయని వేణుస్వామి చెప్పగా దీనికి విరుద్ధంగా ఫలితాలు వచ్చాయి.
అలాగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలుస్తారని వేణుస్వామి జోస్యం చెప్పగా.. ఇక్కడా రివర్స్ అయ్యింది. తన మాటలు, చేతలతో సోషల్ మీడియా జనాలకు ఎప్పుడూ టార్గెట్ అవుతారు వేణుస్వామి .. అలాంటిది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఊరుకుంటారా.. చెడుగుడు ఆడుకున్నారు.

ట్రోలింగ్ దెబ్బకు వేణుస్వామి, ఆరా మస్తాన్లు సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో వారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ దర్శకుడు గీతాకృష్ణ. ఓ ఛానెల్తో ఆయన మాట్లాడుతూ.. ఏపీలో ఎన్నికల సరళి గురించి ఓ స్నేహితుడిని అడిగి తెలుసుకున్నానని, అప్పుడు అతను జగన్కు 15 సీట్లకు మించి రావని చెప్పాడని.. పవన్ ప్రభావం గట్టిగా ఉంటుందని అన్నాడని గీతాకృష్ణ అన్నారు. అయితే కేకే సర్వే సంస్థ వెల్లడించిన సర్వే ఫలితాలు మాత్రం చాలా దగ్గరగా ఉన్నాయని ఆయన ప్రశంసించారు.
వేణుస్వామి జ్యోతిష్యం చెప్పడం ఆపివేసేలా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని గీతాకృష్ణ డిమాండ్ చేశారు. అలాంటి వ్యక్తిని కంట్రోల్ చేయకపోతే ప్రజలు మోసపోతారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బార్లో , పబ్లో కూర్చొని గడిపేవాడు జ్యోతిష్యుడా అంటూ గీతాకృష్ణ ఫైర్ అయ్యారు. రాజకీయ పరమైన జ్యోతిష్యాలే కాదు.. అతను అసలు ఏ టాపిక్పైనా మాట్లాడకూండా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం గీతాకృష్ణ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











