K Viswanath శంకరాభరణం రిలీజ్ రోజే కళాతపస్వి కన్నుమూత.. శంకరా అంటూ తిరిగిరాని లోకాలకు..!
భారతీయ సినిమా పరిశ్రమ గర్వించదగిన దర్శకుడు కళాతపస్వి కాశీనాధుని విశ్వనాథ్ ఇకలేరు. వృద్దాప్య సంబంధింత సమస్యలతో బాధపడుతూ ఫిబ్రవరి 2వ తేదీ 9 గంటల ప్రాంతంలో శ్వాస సంబంధిత సమస్యతో బాధపడటంతో అపోలో హాస్పిటల్కు తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్టు అపోలో వైద్యులు ధృవీకరించారు. ఆయన రాత్రి 9.45 నిమిషాలకు తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే కే విశ్వనాథ్కు ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చిన శంకరాభరణం రిలీజ్ రోజే ఆయన మరణించడం విషాదంగా మారింది. ఈ విషాదం గురించిన వివరాల్లోకి వెళితే..

కే విశ్వనాథ్ దర్శకత్వం వహించిన శంకరాభరణం 1980 సంవత్సరంలో ఫిబ్రవరి 2వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో విడుదలైంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం పండితులనే కాకుండా పామరులను కూడా ఆకట్టుకొన్నది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లో కూడా మంచి రెస్పాన్స్ కూడగట్టుకొన్నది. ఈ చిత్రంలోని ప్రతీ పాట ఇప్పటికీ సినీ అభిమానుల నోళ్లలో నానడం తెలిసిందే.
శంకరాభరణం చిత్రాన్ని జేవీ సోమయాజులు, మంజు భార్గవి, చంద్రమోహన్, రాజ్యలక్ష్మీ, తులసి, నిర్మలమ్మ, సాక్షి రంగారావు, అల్లు రామలింగయ్య తదితరులు నటించారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు బాలూ మహేంద్ర సినిమాటోగ్రఫిని అందించారు. ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రానికి కృష్ణారావు ఎడిటింగ్, కేవీ మహదేవన్ మ్యూజిక్ అందించారు. పూర్ణోదయ బ్యానర్పై రూపొందిన ఈ చిత్రానికి జంధ్యాల మాటలు అందించారు.
కే విశ్వనాథ్కు విదేశాల్లో మంచి పేరు సంపాదించిన శంకరాభరణం సినిమా విడుదల రోజు ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లడం అభిమానులను విషాదంలోకి నెట్టింది.


Click it and Unblock the Notifications











