టాలీవుడ్లో పెను విషాదం.. దర్శకుడు మదన్ హఠాన్మరణం.. మరణానికి కారణమేమిటంటే?
సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణాన్ని ఇంకా మరిచిపోకముందే టాలీవుడ్లో మరో విషాదం చోటుచేసుకొన్నది. ఆ నలుగురు లాంటి అద్బుతమైన చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన దర్శకుడు, నిర్మాత, రచయిత మదన్ ఇకలేరు. గుండెపోటుకు గురైన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. ఆయన స్నేహితులు, సన్నిహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. దర్శకుడు మదన్ వ్యక్తిగత, సినీ జీవితం గురించి వివరాల్లోకి వెళితే..
దర్శకుడు మదన్ నాలుగు రోజుల క్రితం గుండెపోటుకు గురయ్యారు. దాంతో ఆయనను హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందించారు. ఆయనను బతికించేందుకు నిపుణులైన వైద్య బృందం తీవ్రంగా ప్రయత్నించింది. అయితే మృత్యువుతో పోరాటం చేస్తూ ఆయన శనివారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు అని స్నేహితులు, సన్నిహితులు వెల్లడించారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో నిర్వహిస్తారని తెలిపారు.
దర్శకుడు మదన్ చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో జన్మించారు. మదన్ అసలు పేరు రామిగాని మదన్ మోహన్ రెడ్డి అలియాస్ ఆర్ ఆర్ మదన్. తిరుపతిలోని వెంకటేశ్వర యూనివర్సిటీలో పట్టబద్రులయ్యారు. సినిమారంగంపై ఆసక్తితో ఎస్ గోపాల్ రెడ్డి వద్ద అసిస్టెంట్ కెమెరామెన్గా చేరారు. ఆ తర్వాత కొన్ని చిత్రాలకు కో రైటర్గా పనిచేశారు.

అనంతరం 2004లో రాజేంద్ర ప్రసాద్ ప్రధానపాత్రలో నటించిన ఆ నలుగురు సినిమాతో దర్శకుడిగా మారారు. ఆ నలుగురు సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో ఆణిముత్యంలా మిగిలిపోయింది. ఆ నలుగురు సినిమా తర్వాత పెళ్లైన కొత్తలో.. గుండె ఝల్లుమంది, ప్రవరాఖ్యుడు, కాఫీ విత్ మై వైఫ్, గరం, గాయత్రి చిత్రాలను తెరకెక్కించారు.
దర్శకుడు మదన్ హఠాన్మరణంతో సన్నిహితులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఆయన మృతికి ఆర్పీ పట్నాయక్తోపాటు పలువురు శ్రద్దాంజలి ఘటించి సంతాపం తెలియజేస్తున్నారు.


Click it and Unblock the Notifications











