ఇడుపులపాయకు వినిపించాలి.. అమరావతిలో నిద్రపోతున్నవాళ్ళు లేవాలి.. యాత్ర దర్శకుడు!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా యాత్ర చిత్రం తెరకెక్కుతోంది. ఫిబ్రవరి 8 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు భారీ ఎత్తుననిర్వహిస్తోంది. నిన్ననే ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు.రాజశేఖర్ రెడ్డి 2003లో రాష్ట్ర వ్యాప్తంగా చేసిన పాదయాత్ర కీలక అంశంగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. వైఎస్ఆర్ పాత్రలో మలయాళీ స్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు. ట్రైలర్, టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మమ్ముట్టి వైఎస్ఆర్ లాగా హావ భావాలు పలికిస్తున్నారు. దర్శకుడు మహి వి రాఘవ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వైఎస్ఆర్ అభిమానులని ఆకట్టుకునే ప్రసంగం చేశారు.

అరగంట నిద్రపోయి ప్రశాంతంగా
మహి వి రాఘవ్ మాట్లాడుతూ.. యాత్ర చిత్రం విషయంలో తాను పెద్దగా కష్టపడింది ఏమి లేదని మహి వి రాఘవ్ అన్నారు. మమ్ముట్టి ఎలా నటించాలో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సంగీత దర్శకుడు, సినిమాటోగ్రాఫర్, మిగిలిన అన్ని విభాగాల సాంకేతిక నిపుణులు బాగా పనిచేశారు. నేను కాసేపు జ్యూస్ తాగి, మధ్యాహ్నం అరగంట నిద్రపోయి ప్రశాంతగా ఈ చిత్రాన్ని షూట్ చేసినట్లు రాఘవ్ తెలిపారు.

ఇడుపులపాయలో వినిపించాలి
మహి వి రాఘవ్ మాట్లాడుతున్న సమయంలో అభిమానాలు ఈలలు, కేకలతో తమ హర్షాన్ని తెలియజేశారు. ఇక్కడ అరిస్తే ఇడుపులపాయలో వినిపించాలి అని రాఘవ్ అభిమానులని మరింతగా ఉత్తేజ పరిచాడు. మీ అరుపులు నాకు వినిపిస్తున్నాయి. కానీ అమరావతిలో కూడా వినిపించి నిద్రపోతున్న వాళ్ళు లేవాలి అంటూ వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ కు నాకు సంబంధం లేదు. అనుకోకుండా ఈ చిత్రం చేశా. మా అమ్మది కడప జిల్లానే అని రాఘవ్ తెలిపాడు. కడప వాళ్లకు నొప్పి భరించే శక్తి ఉంటుంది అని రాఘవ్ తెలిపారు.

జగనన్న గురించి ఒక్క మాట
జగనన్నని ఈ చిత్రం చేస్తున్న సమయంలో గోదావరి జిల్లాలో కలిశాను. పాదయాత్ర మీద సినిమా చేస్తున్నా అని చెప్పా. అయన ఒక మాట అన్నారు. మా నాయన ఏం చేశాడో అది చూపించు చాలు.. చేయనిది కూడా చూపించి క్రెడిట్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని జగన్ తనతో చెప్పినట్లు మహి వి రాఘవ్ తెలిపారు. ట్రైలర్ చూపించేందుకు మరోమారు కలిశా. అన్నా మీరు సినిమా కూడా చూడాలి అని అడిగా. మీ నాయకుడి కథ మీరు చెబుతున్నారు. నన్నేం చేయమంటావ్ అని జగన్ తనతో అన్నట్లు రాఘవ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో తెలిపారు.

అతిథిగా ఎవర్ని పిలవాలి
ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం చీఫ్ గెస్ట్ గా ఎవర్ని పిలవాలి అని అని అనుకుంటున్న సమయంలో రాజశేఖర్ రెడ్డి అభిమానులని పిలిస్తే చాలు అని తాను నిర్మాతలకు చెప్పినట్లు రాఘవ్ అన్నారు. కథ తయారు చేసే సమయంలో తాను ఎక్కువగా కష్టపడ్డానని, షూటింగ్ మాత్రం ప్రశాంతంగా జరిగిందని రాఘవ్ తెలిపారు. ఫిబ్రవరి 8న యాత్ర చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











