పవన్ కళ్యాణ్ మూవీ: దర్శకత్వం నుండి తప్పుకున్న ఎస్.జె సూర్య
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి దర్శకుడు ఎస్.జె.సూర్య తప్పుకున్నాడు. ఇపుడు ఆయన స్థానంలో 'గొపాల గోపాల' ఫేం డాలీ దర్శకత్వం చేయబోతున్నాడు.
ఏమైంది?
ఎస్.జె.సూర్య ఈ మధ్య నటుడిగా కూడా పలు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నటించిన తమిళ చిత్రం 'ఇరైవి' ఇటీవల విడుదలైంది. ఈ సినిమాలో సూర్య పెర్ఫార్మెన్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో పాటు అవకాశాలు కూడా వెల్లువలా వచ్చి పడ్డాయి. తెలుగు, తమిళంలో ఆయనకు నటుడిగా భారీ ఆఫర్లు వచ్చాయి.

దర్శకత్వంతో పాటు నటుడిగా కూడా రాణించాలని ప్రయత్నిస్తున్న ఎస్.జె.సూర్య ఇటీవల పవన్ కళ్యాణ్ ను కలిసి తనకు అనుగుణంగా షూటింగ్ డేట్స్ అడ్జెస్ట్ చేయాలని ఒక ప్రతిపాదన తెచ్చాడట. అయితే దాని వల్ల షూటింగ్ బాగా లేటవ్వడం, బడ్జెట్ పెరగడం లాంటి ఇబ్బందులు ఉండటంతో కుదరలేదని టాక్. దీంతో ఎస్.జె సూర్య దర్శకత్వం నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. పవన్ కళ్యాణ్, ఎస్.జె.సూర్య పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఎస్.జె.సూర్య తప్పుకోవడంతో నిర్మాత శరత్ మరార్ తో చర్చించిన పవన్ కళ్యాణ్....డాలీని దర్శకుడిగా తీసుకోవాలని నిర్ణయించారు. గతంలో డాలీ పవన్ కళ్యాణ్ నటించిన 'గోపాల గోపాల' సినిమాకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా నిర్మాతల్లో శరత్ మరార్ కూడా ఒకరు. అందరికీ ఓకే కావడంతో డాలీ ఈ చిత్రానికి దర్శకుడిగా ఎంపికయ్యాడు.


Click it and Unblock the Notifications











