ఆ సీన్ సరిగా తీయలేదు.. మగధీరలో చేసి చూపించా, చిరంజీవి మూవీపై రాజమౌళి సంచలన వ్యాఖ్యలు
దశాబ్ధాలుగా టాలీవుడ్కు మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్నారు చిరంజీవి. క్లాస్, మాస్ తేడా లేకుండా అన్ని వర్గాలను అలరించడమే ధ్యేయంగా ఆయన సినిమాలుంటాయి. ప్రయోగాల కంటే ప్రేక్షకులకు వినోదం అందించాలన్నదే చిరంజీవి తాపత్రయం. ఆయన కెరీర్లో ఎక్కువగా కమర్షియల్ చిత్రాలే ఉండటం దీనికి నిదర్శనం. 90వ దశకంలో చిరంజీవి తన విశ్వరూపం చూపించారు. సినిమాల బడ్టెజ్, రెమ్యునరేషన్, వసూళ్లపరంగా టాలీవుడ్ మార్కెట్ను పెంచారు.
రూ.కోటి పారితోషికం తీసుకుని .. ఈ ఘనత అందుకున్న తొలి భారతీయ నటుడిగా రికార్డుల్లోకెక్కారు. 1992లో వచ్చిన ది వీక్ మ్యాగజైన్లో చిరంజీవిపై ప్రత్యేకంగా ఓ ఆర్టికల్ రాశారు.. కవర్ పేజీపై మెగాస్టార్ ఫోటో పెట్టి.. బిగ్గర్ దెన్ బచ్చన్ అంటూ ప్రచురించారు. అప్పట్లో భారతీయ సినీ పరిశ్రమను ఏలుతున్న అమితాబ్ బచ్చన్ సైతం ఒక్కో సినిమాకు కేవలం రూ.90 లక్షలు మాత్రమే తీసుకునేవారు. చిరంజీవి తర్వాతే కమల్, రజినీ, అమితాబ్, షారుఖ్, సల్మాన్ ఖాన్లు నిలిచారంటే మెగాస్టార్ స్టామినా ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

తన సినిమాల చిత్రీకరణ సమయంలోనే ఔట్పుట్ను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని , తప్పులుంటే సరిదిద్దుకోవడం చిరంజీవికి అలవాటు . చిన్న తప్పు జరిగినా వందలాది మంది కష్టం , డబ్బు వృధా అవుతుందనేది మెగాస్టార్ అభిప్రాయం. చిరులాగే దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా సినిమాను తెరకెక్కించేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. రోజూ రా ఫుటేజ్ చెక్ చేసుకోవడం, తప్పులెమైనా ఉంటే రీషూట్ చేయడం చేస్తుంటారు. సినిమాను శిల్పంలా చెక్కుతారు కాబట్టే రాజమౌళిని ఎన్టీఆర్ ముద్దుగా జక్కన్న అని పిలుస్తుంటారు.
సినిమాను అద్భుతంగా విశ్లేషించగల మేధావి రాజమౌళి. అందుకే ఆయన భారతదేశం గర్వపడే గొప్ప దర్శకుడయ్యారు. ఈ క్రమంలోనే ఓ చిరంజీవి సినిమాలోని ఓ సీన్ విషయంలో జక్కన్న అసంతృప్తి వ్యక్తం చేశారు. కొద్దిరోజుల క్రితం ఓ ఈవెంట్లో పాల్గొన్న రాజమౌళి మాట్లాడుతూ.. తాను చిరంజీవికి పెద్ద అభిమానినని, ఆయన నటించిన కొదమసింహ సినిమాలో రౌడీలు మెగాస్టార్ను పీకల్లోతు ఇసుకలో పాతిపెట్టి వెళ్లిపోతారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆయన గుర్రం చిరంజీవి నోటికి తాడు అందించి కాపాడుతుంది.
ఆ సీన్ చూసి బాగా ఎమోషనల్ అయ్యానని.. కానీ హీరోకి, ఆ గుర్రానికి ఎలాంటి అటాచ్మెంట్ లేదనిపించిందని, మనకు సాయం చేసిన వ్యక్తికి థ్యాంక్స్ చెప్పకపోతే ఆ భావోద్వేగం ఎలా సంపూర్ణమవుతుందని రాజమౌళి ప్రశ్నించారు. అందుకే ఈ సీన్ తనకు నిరుత్సాహం కలిగించిందని జక్కన్న చెప్పారు. దీనిని బేస్ చేసుకునే మగధీరలో ఇసుక ఊబిలో కూరుకుపోయిన హీరో బయటకు వచ్చిన తర్వాత తన గుర్రాన్ని కౌగిలించుకుంటానని, ఓ మిత్రుడిలా దానిని చూస్తూ కృతజ్ఞతగా మాట్లాడతాడని ఆయన తెలిపారు. తన సినిమాల్లో బలమైన సన్నివేశాలు రావడానికి కారణం ప్రేక్షకుల ఆలోచనలేనని రాజమౌళి వెల్లడించారు. ప్రస్తుతం రాజమౌళి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











