Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
దీపావళి రిలీజ్ : రెండిటి మధ్యనే గట్టి పోటీ
ముంబై : ఈ దీపావళి రోజున బాలీవుడ్ సినిమాలు రెండు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతూ సినిమా ప్రేమికుల్లో అమితాసక్తిని రేకెత్తిస్తున్నాయి. వంద కోట్ల క్లబ్లో చేరే సత్తా ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్న ఆ రెండు సినిమాలు షారుఖ్ఖాన్ హీరోగా నటించిన 'జబ్ తక్ హై జాన్', అజయ్ దేవ్గన్ హీరోగా రూపొందిన 'సన్ ఆఫ్ సర్దార్'. పూర్తి స్థాయిలో భారతీయ మూవీ మార్కెట్ స్టామినా ఏ పాటిదో ఈ సినిమాలు నిరూపించబోతున్నాయి. ఎందుకంటే దేశంలోని అత్యధిక సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఈ రెంటిలో ఏదో ఓ సినిమా ఆడబోతోంది. గతంలో ఒకేసారి విడుదలైన సినిమాలు రెండింటినీ ప్రేక్షకులు ఆదరించిన సందర్భాలున్నాయి కాబట్టి బాగుంటే ఈ సినిమాలు రెండూ హిట్టవడం ఖాయమనీ, కారణం రెండు సినిమాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనీ విశ్లేషకులు అంటున్నారు.
అజయ్ దేవగణ్ హీరోగా నటిస్తూ నిర్మించిన తాజా చిత్రం 'సన్నాఫ్ సర్దార్'. సోనాక్షి సిన్హా కథానాయిక. అశ్వినీ ధీర్ దర్శకత్వం వహించారు. సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో నటించారు. సల్మాన్ ఖాన్ కూడా ఓ ప్రత్యేక గీతంలో నర్తించారు. ఈ చిత్రం మంగళవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. చిత్రం గురించి అజయ్ దేవగణ్ చెబుతూ ''తెలుగులో వచ్చిన 'మర్యాదరామన్న' చిత్రం ఆధారంగా దీన్ని రూపొందించాం. అయితే కథలో కొన్ని మార్పుచేర్పులు చేశాం. తప్పకుండా ఉత్తరాది ప్రేక్షకులకు మా ప్రయత్నం నచ్చుతుంది. కథానాయకుడి పాత్ర ద్వారా వీలైనంత హాస్యం పండేలా జాగ్రత్తలు తీసుకున్నాం. ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తే సర్దార్జీని ఇందులో చూస్తార''ని వెల్లడించారు.
షారూఖ్ ఖాన్ తాజాగా నటించిన చిత్రం 'జబ్ తక్ హై జాన్'. కత్రినా కైఫ్, అనుష్క శర్మ కథానాయికలు. మంగళవారం విడుదలవుతోంది. యశ్చోప్రా దర్శకత్వంలో రూపొందిన చివరి చిత్రమిదే కావడంతో అంచనాలు పెరిగాయి. ఆదిత్య చోప్రా నిర్మాత. ఇందులో ఆర్మీ అధికారి సమర్ ఆనంద్ పాత్రలో షారుఖ్ ఖాన్ నటించారు. మహిళా వ్యాపారవేత్త మీరా పాత్రలో కత్రినా కైఫ్, జర్నలిస్టు అకిరాగా అనుష్క శర్మ కనిపించారు. ఈ ముగ్గురి మధ్య జరిగే కథే 'జబ్ తక్ హై జాన్'. షారుఖ్ ఈ సినిమా గురించి చెబుతూ ''యశ్జీతో పనిచేయడం నాకెంతో సరదాగా అనిపించేది. రొమాన్స్ని ఆయన తెర మీద అద్భుతంగా ఆవిష్కరిస్తారు. ఆయనతో ప్రేమకథ అంటే ఇక చెప్పనవసరం లేదు. తాజా చిత్రంలో ఆయన మార్కు చూడొచ్చు'' అన్నారు.
గత దీపావళికి 'రా.వన్'తో ప్రేక్షకుల ముందుకొచ్చారు షారుఖ్ ఖాన్. భారీ బడ్జెట్తో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కిన ఈ చిత్రం వసూళ్లపరంగా విజయం సాధించినా... ఆశించినంతగా మంచి ఫలితం ఇవ్వలేకపోయింది. అందుకే ఇకపై ఇలాంటి సినిమాలు తీయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తానని షారుఖ్ ఖాన్ వెల్లడించారు. ఆయన చెబుతూ ''సైన్స్-ఫిక్షన్ తరహా కథల్ని తెరమీదకు తీసుకురావాలంటే చాలా కష్టపడాలి. బడ్జెట్ కూడా అదుపులో ఉండదు. అందుకే మళ్లీ అలాంటి సినిమాలు తీయాలంటే భయమేస్తోంది'' అని అన్నారు.
ఇటీవల ఎక్కువ థియేటర్లను కాప్చర్ చేయడం ద్వారా తమ సినిమాకు నష్టం కలిగించిందంటూ కాంపిటిషన్ అప్పిలేట్ ట్రిబ్యునల్కు యశ్రాజ్ ఫిలిమ్స్పై అజయ్ దేవ్గన్ ఫిలిమ్స్ ఫిర్యాదు చేయడం హెడ్లైన్స్కెక్కింది. 'సన్ ఆఫ్ సర్దార్' కంటే 'జబ్ తక్ హై జాన్' రెట్టింపు సంఖ్యలో మల్టీప్లెక్స్లలో కానీ, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో విడుదలవుతుండటం దీనికి కారణం. మరి ఈ రెండు చిత్రాల్లో ఏ చిత్రం ప్రేక్షకుల మనస్సు దోచుకుంటుందో చూడాలి.