Gaddar గద్దర్ నటించిన చివరి చిత్రం ఏమిటో తెలుసా? వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణపై ప్రజా యుద్ధనౌక పోరాట గళం!
బుల్లెట్ ద్వారానే విప్లవం, మార్పు సాధించాలనే లక్ష్యంతో చివరి ఊపిరి వరకు ప్రజా ఉద్యమాలకు జీవితాన్ని అంకింత చేసిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఇకలేరు. బైపాస్ సర్జరీ అనంతరం ఊపిరితిత్తులు, మూత్ర పిండాల సమస్యలతో పోరాటం చేస్తూ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో హైదరాబాద్లోని అమీర్పేటలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో విప్లవ, సాహితి, ప్రజా ఉద్యమాల నేతలు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు.
గద్దర్ ఇకలేరనే వార్తతో విషాదంలో మునిగిపోయారు. ఈ విషాదాన్ని జీర్ణించుకోలేని ఆయన అభిమానులు, సన్నిహితులు, స్నేహితులు శ్రద్దాంజలి ఘటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సినీ జీవితం గురించిన విషయాల్లోకి వెళితే..

విప్లవ సాహిత్యంతో ప్రజలను చైతన్యపరిచే ప్రజా గేయాలతో గద్దర్ సంగీత రంగంలో కొత్త ఒరవడిని సృష్టించారు. పలు చిత్రాల్లో ఆయన పాటలు, ఆటపాటలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని, పోరాట స్పూర్తిని రగిలించాయి. మాభూమి, అర్ధరాత్రి స్వతంత్రం, ఒరేయ్ రిక్షా, జై భోలో తెలంగాణ తదితర చిత్రాల్లో నటించారు.
అయితే గద్దర్ నటించిన చివరి చిత్రం ఉక్కు సత్యాగ్రహం. సత్యారెడ్డి ప్రధాన పాత్రలో నటించడంతోపాటు నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలను చేపట్టి నిర్మిస్తున్న చిత్రంలో గద్దర్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం కోసం పాటలు కూడా రాశారు. తమ చిత్రంలో నటించి, పాటలు పాడిన గద్దర్ ఇక లేరనే విషయంతో చిత్ర యూనిట్ విషాదంలో మునిగిపోయింది. ఆయన చిత్ర పటానికి శ్రద్దాంజలి ఘటించారు.

వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను నిరిసిస్తూ ప్రభుత్వాలపై విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టి రూపొందించిన చిత్రం ఉక్కు సత్యాగ్రహం కోసం ఇటీవల రీ రికార్డింగ్ పనుల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన ఈ సినిమా కోసం అందించిన విశేష సేవలను గుర్తు చేసుకొన్నారు. ఆయన మరణవార్తతో దిగ్బ్రాంతికి గురైన చిత్ర యూనిట్ సభ్యులు.. ఆత్మకు శాంతి కలుగాలని భగవంతుడిని ప్రార్థించారు.

జనం ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న చిత్రంలో వైజాగ్ ఎంపీ ఎంవీవీ సత్యానారాయణ, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ నాయకులు అయోధ్య రామ్ నటించారు. గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, సత్యారెడ్డి, మజ్జి దేవిశ్రీ చక్కని పాటలు రాశారు. డబ్బింగ్ పనులు పూర్తయ్యాయి. రీ రికార్డింగ్ పనులు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications











