Most Awaited Telugu films: ఆ 5 చిత్రాల కోసం కళ్లు కాయలు కాచేలా వెయిటింగ్.. ఆ సినిమాలు ఏమిటో తెలుసా?
గడిచిన కొద్దినెలలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వెలవెలబోతోంది. పెద్ద హీరోల సినిమాలు రాకపోవడంతో థియేటర్లు కూడా కళతప్పాయి. సంక్రాంతి తర్వాత ఆ స్థాయిలో సినిమాల సందడి లేదు.. ఎన్నికలు, ఐపీఎల్ సీజన్లకు భయపడి సినిమా రిలీజ్లను మేకర్స్ వాయిదా వేసుకున్నారు. సమ్మర్ సీజన్లోనూ బొమ్మ పడకపోవడంతో థియేటర్లపై ఆధారపడి జీవించేవారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చిత్ర ప్రదర్శనలు లేకపోవడంతో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడ్డాయి కూడా. పరిస్ధితి ఇలాగే కొనసాగితే థియేటర్లు అత్యంత వేగంగా షాపింగ్ మాల్స్గా, ఫంక్షన్ హాల్స్గా మారిపోతాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
అయితే ఇది కొన్ని రోజులేనని ఈ నెల నుంచి దసరా , దీపావళి సీజన్ వరకు పెద్ద సినిమాలు విడుదలవుతాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన వాటి సంగతి ఏవో కానీ కొన్ని సినిమాల కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ని మరో మెట్టు ఎక్కించడానికి ఐదు క్రేజీ ప్రాజెక్ట్లు రిలీజ్కు రెడీగా ఉన్నాయి. ఓర్మాక్స్ సినిమాటిక్స్ మోస్ట్ అవెయిటెడ్ తెలుగు ఫిల్మ్స్గా పుష్ప-2, దేవర పార్ట్ - 1, ఓజీ, జై హనుమాన్, స్పిరిట్ నిలిచాయి. ఈ సినిమాల కోసం ఒక్క తెలుగు ప్రజలే కాదు.. యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.

వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది పుష్ప-2 గురించే. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప-1 దేశాన్ని ఊపేయడంతో సెకండ్ పార్ట్ కోసం జనం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్లు, గ్లింప్స్, ఫస్ట్ లుక్, అల్లు అర్జున్ గెటప్స్కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా పుష్ప 2ను విడుదల చేయాలని భావించారు. అయితే అనివార్య కారణాలతో డిసెంబర్ 6కు వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల ప్రకటించింది. పుష్ప-2లో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తుండగా.. విలన్గా మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ చేస్తున్నారు. అనసూయ, సునీల్, రావు రమేశ్, జగపతి బాబు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'దేవర'. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్బస్టర్ తర్వాత కొరటాల - ఎన్టీఆర్ కలయికలో వస్తోన్న సినిమా కావడంతో దేవరపై భారీ అంచనాలున్నాయి. ఇందులో ఎన్టీఆర్ సరసన శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు.. ఇది ఆమెకు తొలి తెలుగు చిత్రం. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దేవర బిజినెస్ ఓ రేంజ్లో జరుగుతోందని ఇన్సైడ్ టాక్. ఒక్క కోస్తాంధ్రలోనే రూ.55 కోట్ల పైగానే బిజినెస్ జరిగినట్లుగా వార్తలు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ను ఈ ఏడాది అక్టోబర్ 10న రిలీజ్ చేయనున్నారు.

సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న చిత్రం 'ఓజీ' . డీవీవీ దానయ్య భారీ బడ్జెట్తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. 'ఓజీ' ద్వారా పవన్ తొలిసారిగా పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే చాలా వరకు సినిమా షూటింగ్ పూర్తయ్యింది. పవన్ కళ్యాణ్కు సంబంధించి ఇంకా 15 నుంచి 20 రోజుల వర్క్ పెండింగ్లో పడిపోయింది. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా, మంత్రిగా ఫుల్ బిజీగా ఉన్నారు.
ఈ సమయంలో సినిమా షూటింగ్లకు సమయం కేటాయిస్తే విపక్షాల విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందని పవన్ భావిస్తున్నారు. వీలు చూసుకుని పవన్ .. సెట్స్లో అడుగుపెట్టే అవకాశం ఉంది. ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీయారెడ్డి, ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్, షాన్ కక్కర్, హరీశ్ ఉత్తమన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తోన్న ఓజీని సెప్టెంబర్ 27న విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.
యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ - తేజా సజ్జ కాంబినేషన్లో వచ్చిన 'హను-మాన్' బ్లాక్బస్టర్ కావడంతో దీనికి సీక్వెల్గా 'జై హనుమాన్' ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. ఈ మూవీలో ఆంజనేయుడి పాత్రను ఓ పాన్ ఇండియా స్టార్ పోషించనున్నారు. తేజ సజ్జా ఇందులో నటించినా హీరో కాదని.. హనుమంతుడే హీరోగా కనిపిస్తాడని ప్రశాంత్ వర్మ వెల్లడించారు. 2025 సంక్రాంతి కానుకగా జైహనుమాన్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రం 'స్పిరిట్'. యానిమల్తో క్రేజీ డైరెక్టర్గా మారిన సందీప్ నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ, రణబీర్ కపూర్, షాహిద్ కపూర్ల లుక్, డైలాగ్ డెలివరీని సందీప్ పూర్తిగా మార్చేశారు. ప్రభాస్ను సందీప్ ఎలా చూపిస్తాడోనని ఇండస్ట్రీ ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.


Click it and Unblock the Notifications











