డబ్బులు తేని డబ్బింగులు(ఫోటో ఫీచర్)
చెన్నై: తమిళ, మళయాళంలో రిలీజైన ప్రతీ సినిమా హీరో, హీరోయిన్ తో సంభందం లేకుండా ఇక్కడ రిలీజై పోతున్నాయి. సినిమా బాగుంటే చాలు - అది స్ట్రైయిట్ సినిమానా? డబ్బింగ్ బొమ్మా? అని ఆలోచించరు తెలుగు ప్రేక్షకులు అంటూ అవి ధైర్యంగా తెలుగు తెరపై దూకేస్తున్నాయి. కమల్ హాసన్ నుంచి కార్తి వరకూ విక్రమ్ నుంచి విశాల్ వరకూ... తెలుగు, తమిళ భాషలని ఏలాలనే తాపత్రయం. అంతేకాదు తెలుగు భాష నేర్చుకొని, తమ సినిమాలకు తామే డబ్బింగు చెప్పుకొంటున్నారు. అయితే ఇప్పుడు సీను రివర్స్ అయ్యింది. 2012లో డబ్బింగ్ చిత్రాల మార్కెట్కి గండిపడింది. ఈ యేడాది ఇప్పటి వరకూ ఒక్క అనువాద సినిమా కూడా బాక్సాఫీసు దగ్గర నిలబడలేకపోయింది. భారీ అంచనాలతో వచ్చిన డబ్బింగ్ సినిమాలను ఓ సారి గుర్తు చేసుకుంటే...

కార్తికి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఆ జోరులోనే కార్తి తొలి చిత్రం 'పరుత్తివిరన్'ని 'మల్లిగాడు' రూపంలో తీసుకొచ్చారు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు రుచించలేదు. రాజకీయపరమైన అంశాలతో అల్లుకున్న చిత్రంగా 'శకుని' వచ్చింది. అది కూడా నిరాశపరచింది. శకుని చిత్రం పూర్తిగా మహేష్ బిజినెస్ మ్యాన్ లా ఉందని విమర్శలు సంపాదించుకోవటం తప్ప రూపాయి సంపాదించలేకపోయింది. టీవీ ఛానెల్స్ లో ఎంతలా ఈ చిత్రం గురించి హోరెత్తించినా ఫలితం లేకుండా పోయింది.

కార్తీ అన్నయ్య సూర్య పరిస్థితీ ఇంతే. ఇటీవల 'బ్రదర్స్' పేరుతో ప్రేక్షకుల్ని పలకరించారు. 'రంగం' తరవాత కె.వి.ఆనంద్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. పైగా సూర్య అవిభక్త కవలలుగా నటించారు. దాంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. అనుకున్న స్థాయిలో 'బ్రదర్స్' ఆదరణ పొందలేదు. ఇక్కడ ఎంతో ఖర్చు పెట్టి కొన్న నిర్మాత బెల్లంకొండ ను నట్టేట ముంచింది.

అపరిచితుడు,భారతీయుడు, జెంటిల్ మ్యాన్, ప్రేమికుడు ఇలా ప్రతీ శంకర్ సినిమా ఇక్కడ రికార్డులు క్రియేట్ చేసింది. అయితే తెలుగునాట ఈసారి శంకర్కీ చేదు అనుభవమే మిగిలింది. 'త్రీ ఇడియట్స్'ని తమిళంలో 'నన్బన్' పేరుతో రీమేక్ చేశారు. తమిళ రూపాన్ని తెలుగులోకి దిల్ రాజు 'స్నేహితుడు'గా తీసుకొచ్చారు. విజయ్, ఇలియానా జంటగా నటించారు. బాక్సాఫీసు దగ్గర ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది.

'అపరిచితుడు' తరవాత విక్రమ్కి తెలుగులో ఒక్క విజయమూ దక్కలేదు. ఈసారి ఆయన నటించిన 'శివతాండవం' విడుదలైంది. ఇందులో తెలుగు హీరో జగపతిబాబు కూడా నటించారు. ఈ చిత్రం ప్రేక్షకుల్ని రంజింపజేయలేకపోయింది. ఈ చిత్రాన్ని కూడా భారీ మొత్తానికే నిర్మాత సి.కళ్యాణ్ తీసుకుని నష్టపోయారు.

అజిత్ నటించిన 'డేవిడ్ బిల్లా' కూడా పరాజయ చిత్రాల జాబితాలోకే చేరింది. . డబ్బింగ్ చిత్రమైనా ప్రతీ చోటా హౌస్ ఫుల్ బోర్డులు,బ్లాక్ లో టిక్కెట్లు అమ్మే స్ధితిలో క్రేజ్ క్రియేట్ చేసింది. అయితే సినిమా మాత్రం అందరి అంచనాలనూ తల క్రిందులు చేస్తూ ప్లాప్ గా మిగిలింది. స్టైలిష్ నటన పేరుతో సినిమాను లాజిక్ లు లేకుండా నత్త నడకతో నడిపించటం ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారింది. గతంలో అజిత్ గాంబ్లర్ మాదిరిగానే ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కానీ స్ధితి చేరుకుంది.

శ్రీదేవి దశాబ్దంన్నర తరవాత కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టారు... 'ఇంగ్లీష్ వింగ్లీష్' పేరుతో! ఈ హిందీ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లోకి అనువదించారు. తెలుగులో మినహా మిగిలిన రెండు భాషల్లోనూ నెగ్గుకొచ్చింది. తెలుగులో మాత్రం నిర్మాతలకు నష్టాన్నే మిగిల్చింది.
ఈ యేడాది ఇప్పటి వరకూ 75 అనువాద చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. 'మల్లిగాడు', 'ఏకవీర', 'స్నేహితుడు', 'కిలాడీ', 'త్రీ', 'డేవిడ్ బిల్లా', 'శకుని', 'శివతాండవం', 'ఒకే ఒకే', 'బ్రదర్స్', 'స్పైడర్మేన్ 4', 'ఇంగ్లీష్ వింగ్లీష్'... ఇలా ఉందీ ఆ జాబితా. 'నిరంతరం నీ ఊహలే', 'రేణిగుంట', 'ఓకే ఓకే', 'ప్రేమలో పడ్డారు' లాంటి చిత్రాలు బాక్సాఫీసు దగ్గర సందడి చేయలేపోయాయి. తమిళం నుంచి వచ్చినవే కాదు హిందీ, మలయాళ, కన్నడ, ఆంగ్ల భాషల నుంచి వచ్చినవీ టాలీవుడ్లో పరాజయాన్నే మూటగట్టుకొన్నాయి. మలయాళం నుంచీ కొన్ని చిత్రాలు వచ్చాయి. ఏవీ నిలబడలేదు. 'ఈగ' విజయం తరవాత సుదీప్ కన్నడంలో నటించిన చిత్రాల్ని దిగుమతి చేయడం మొదలుపెట్టారు. ఆంగ్లం నుంచి 'స్పైడర్మేన్ 4' లాంటి భారీ చిత్రాలు అనువాదమయ్యాయి. వాటికీ ఆదరణ దక్కలేదు.


Click it and Unblock the Notifications











