కన్నీటీ నివాళి మధ్య రామోజీరావు అంత్యక్రియలు పూర్తి.. గొప్ప పని చేసిన చంద్రబాబు నాయుడు
తెలుగు రాష్ట్రాల కీర్తిని దేశ వ్యాప్తంగా చాటి చెప్పిన దిగ్గజాలు కొందరు మాత్రమే ఉన్నారు. అలాంటి వారిలో ప్రముఖ నిర్మాత, ఈనాడు గ్రూప్స్ చైర్మన్ రామోజీ రావు ఒకరు. సాధారణ వ్యాపారవేత్తగా ప్రయాణాన్ని మొదలు పెట్టిన ఆయన.. పత్రిక అధిపతిగా, నిర్మాతగా, సక్సెస్ఫుల్ బిజినెస్మ్యాన్గా సత్తా చాటారు. ఇలా సుదీర్ఘ కాలంగా తనదైన రంగాల్లో సేవలు అందిస్తోన్న రామోజీరావు శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. దీంతో తాజాగా ఆయన అంత్యక్రియలను పూర్తి చేశారు. ఇందులో చంద్రబాబు నాయుడు ఓ గొప్ప పని చేశారు. వివరాల్లోకి వెళ్తే...
అనారోగ్యంతో కన్నుమూత
లెజెండరీ పర్సన్ రామోజీరావు ఈ నెల 5వ తేదీన గుండెకు సంబంధించిన సమస్యతో ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండడంతో వైద్యులు చికిత్సను అందించారు. ఈ పరిస్థితుల్లో శనివారం తెల్లవారుజామున ఆయన పరిస్థితి విషమించింది. దీంతో రామోజీరావు ఈరోజు తెల్లవారుజామున ఆస్పత్రిలోనే తుదిశ్వాసను విడిచారు.

రామోజీ ఫిల్మ్ సిటీలోనే
రామోజీరావు మరణించిన వెంటనే ఆయన పార్థీవదేహాన్ని హైదరాబాద్ నగర శివారులో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీకి తరలించారు. అప్పటి నుంచి అక్కడ ప్రజల, ప్రముఖుల సందర్శనార్థం ఉంచారు. దీంతో ఆయనను చివరి చూపు చూసుకునేందుకు సినిమా, రాజకీయ, వ్యాపార, పత్రికా రంగాల ప్రముఖులతో పాటు సామాన్యులు సైతం వేల సంఖ్యలోనే హాజరయ్యారు.
ప్రభుత్వ లాంఛనాలతో
మరణానంతరం తన అంత్యక్రియలు చేయడానికి రామోజీరావు ముందుగానే స్మృతివనాన్ని ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. అక్కడే ఆయనకు అంతిమ సేవలు చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం రామోజీరావు అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరిపించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

గొప్ప పని చేసిన బాబు
రామోజీరావు పార్థీవదేహాన్ని నేటి ఉదయం 9 గంటల తర్వాత ఫిల్మ్ సిటీలో ఉన్న ఆయన నివాసం నుంచి స్మృతివనానికి తరలించారు. ఆ సమయంలో ఆయన భౌతికకాయాన్ని తరలించే వాహనంతో పాటు వందల సంఖ్యలో అభిమానులు వెంట వచ్చారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు.. రామోజీరావు పాడెను మోసి తన స్నేహభావాన్ని చాటుకున్నారు.
అంత్యక్రియలు పూర్తి
ముందుగా ప్రకటించినట్లుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో జరిపించింది. ఇందులో ఆయన కుమారుడు కిరణ్ తన తండ్రి పార్థివదేహానికి తుది సేవలు చేశారు. అనంతరం పండితుల సమక్ష్యంలో అంత్యక్రియలను పూర్తి చేశారు. ఇవి పూర్తిగా అయ్యేంత వరకూ చంద్రబాబు అక్కడే ఉండడం గమనార్హం.


Click it and Unblock the Notifications











