Eenadu Ramoji Rao: తెలుగు రాష్ట్రాల్లో పెను విషాదం.. ఈటీవీ రామోజీరావు కన్నుమూత
సినీ రంగానికి సంబంధించి ఈ మధ్య కాలంలో విషాదకర సంఘటనలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ రెండు మూడు నెలల వ్యవధిలోనే సినీ రంగంతో సంబంధం ఉన్న ఎంతో మంది నటులు, టెక్నీషియన్లు, డైరెక్టర్లు, నిర్మాతలు ప్రాణాలు విడిచారు. ఇలా ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా ఎన్నో సినిమాలను తీసిన ప్రముఖ వ్యాపారవేత్త రామోజీరావు కన్నుమూశారు. దీంతో టాలీవుడ్లో విషాదఛాయలు అలముకున్నాయి.
దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా టీవీ రంగంలో, సినిమా రంగంలో తనదైన మార్కును చూపించిన రామోజీరావు (87) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 5వ తేదీన గుండెకు సంబంధించిన సమస్యతో ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండడంతో వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో శనివారం తెల్లవారుజామున ఆయన పరిస్థితి విషమించింది. దీంతో రామోజీరావు ఈరోజు ఉదయం 4.50 గంటలకు ఆస్పత్రిలోనే తుదిశ్వాసను విడిచారు.

రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబరు 16న రైతుకుటుంబంలో జన్మించారు. ఢిల్లీలో అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్టుగా ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆయన.. హైదరాబాద్కు వచ్చి ఎన్నో వ్యాపారాలను ప్రారంభించారు. ఇలా ఈనాడు గ్రూప్స్ను మొదలు పెట్టారు. అలా ఎదుగుతోన్న సమయంలోనే 'ఉషా కిరణ్ మూవీస్' అనే సంస్థను స్థాపించి సినిమా నిర్మాతగానూ మారారు. ఇలా 1984లో వచ్చిన 'శ్రీవారికి ప్రేమలేఖ' అనే చిత్రంతో ఆయన ప్రొడ్యూసర్గా ప్రయాణాన్ని మొదలు పెట్టారు.
సుదీర్ఘమైన ప్రయాణంలో రామోజీరావు 70కి పైగా సినిమాలను నిర్మించారు. అందులో తెలుగు చిత్రాలతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, బెంగాళీ సినిమాలు కూడా ఉన్నాయి. ఆయన నిర్మించిన చివరి చిత్రం 2015లో వచ్చిన 'దాగుడుమూతల దండాకోర్'. ఇక, నిర్మాతగా రామోజీరావు ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అదే సమయంలో ఎన్నో ఘనతలను, అవార్డులను, రికార్డులను సొంతం చేసుకున్నారు. ఆయన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం 2016లో పద్మవిభూషణ్ పురస్కారాన్ని సైతం అందించింది.


Click it and Unblock the Notifications











