అమెరికా వరకు వెళ్లిన దాసరి తొలి సినిమా ఇదేనంట...
హైదరాబాద్: దర్శకరత్న దాసరి నారాయణరావు గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. కెరీర్లో 150 సినిమాలకు దర్శకత్వం వహించిన ఘనుడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న 151వ సినిమా ‘ఎర్ర బస్సు'. ఈ చిత్రం అమెరికాలో దాదాపు 150 స్క్రీన్లలో విడుదలవుతోందట.
దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన సినిమాల్లో అమెరికాలో ప్రదర్శితం అవుతున్న తొలి సినిమా ఇదేనంట. ఆయన దర్శకత్వం వహించిన గత 150 సినిమాల్లో ఏ ఒక్క సినిమా కూడా అమెరికా థియేటర్ల వరకు వెళ్లలేదు. తెలుగు సినిమా ప్రపంచ నలుమూలలాకు వ్యాపించి చాలా ఏళ్లయినా... దాసరి 150 సినిమాల్లో ఏ ఒక్కటి ఇప్పటి వరకు అక్కడ రిలీజ్ కాక పోవడం ఆశ్చర్యమే. మొత్తానికి ‘ఎర్ర బస్సు' ద్వారా దాసరి సినిమా అమెరికా థియేటర్లకు పరిచయం అవుతుందన్నమాట.
ఎర్రబస్సు సినిమా విషయానికొస్తే...
దర్శకరత్న దాసరి నారాయణరావు స్వీయ దర్శకత్వంలో 151వ చిత్రంగా రూపొందుతున్న ‘ఎర్రబస్సు' చిత్రాన్ని నవంబర్ 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా 509 థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మంచు విష్ణు, కేథరిన్ థెరిస్సా హీరో హీరోయిన్లుగా దాసరి ప్రధాన పాత్రలు పోషించిన ‘ఎర్రబస్సు' చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి స్వరాలందించారు.

ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో ఎలాంటి అసభ్యత లేదని, ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ చిత్రమని క్లీన్ ‘U' సర్టిఫికెట్ జారీ చేసింది. దాసరి కెరీర్లో ఇప్పటి వరకు 150వ సినిమాలు చేసారు. ఈ చిత్రం ‘U' సర్టిఫికెట్ అందుకున్న 90వ చిత్రం కావడం విశేషం.
సినిమా గురించి దాసరి మాట్లాడుతూ ''తాతమనవళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే చిత్రమిది. కుటుంబమంతా కలిసి చూసేలా తీర్చిదిద్దాను. సెంటిమెంట్తో పాటు వినోదానికీ ప్రాధాన్యముంది. విష్ణు ఉత్తమ నటనను కనబరిచాడు. 'ఎర్రబస్సు' అనే పేరును ఒక గుర్తుగా వాడాం. ఎర్రబస్సు ఎక్కినోళ్లు ఎంత గట్టివాళ్లు అనే విషయం అంతర్లీనంగా అర్థమవుతుంటుంది'' అన్నారు.
నారాయణస్వామి ఓ పల్లెటూరి మనిషి. ఆయన మనవడికి మాత్రం అమెరికా వెళ్లాలనేది లక్ష్యం. చిన్నప్పట్నుంచి తనకి ఓ స్నేహితుడిలా ఉంటూ వచ్చిన తాతయ్యని మూడు నెలల పాటు బాగా సంతోష పెట్టాలని హైదరాబాద్ తీసుకొస్తాడు. ఆ మూడు నెలల కాలంలో ఏం జరిగింది? పట్నం వచ్చిన తాతయ్య మనవడి కోసం ఏం చేశాడు? తదితర విషయాలు తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు దాసరి నారాయణరావు.


Click it and Unblock the Notifications











