ఆ సాయినాథుని, వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నా: మోహన్ బాబు
దిల్లీ: కలాం మరణం పట్ల యావత్దేశం శోకతప్త హృదయంతో స్పందిస్తోంది. రాష్ట్రపతిగా అబ్దుల్కలాం ఎంతటి ప్రజాభిమానాన్ని సంపాదించుకున్నారన్నది ఆయన మృతికి నివాళిగా వెల్లువెత్తిన సంతాపాలు వెల్లడిస్తున్నాయి.కలాంను 'ప్రజల రాష్ట్రపతి'గా, 'స్ఫూర్తిదాయక నాయకుడు'గా రాష్ట్రపతి, ప్రధాని అభివర్ణించారు. మంచు మోహన్ బాబు...ఆయన మృతిపై ఈ క్రింద విధంగా స్పందించారు.
"దేశంలోని ఎంతో మంది యువతకు కలాంగారు ఆదర్శప్రాయుడు. తన శాస్త్ర విజ్ఞానంతో మన దేశానికి ప్రపంచంలో గుర్తింపును తెచ్చారు. స్వయంకృషితో అత్యున్నత స్థానానికి ఎదిగారు. ఎంత ఎదిగినా నిరాడంబరంగా ఉండటం ఆయనకే చెల్లుతుంది. యువతను ప్రేరేపిస్తూ వారే దేశాన్ని ముందుండి నడిపించాలనేవారు.
ఏ అవార్డులు చేపట్టినా, పదవులు అలంకరించినా వాటికి వన్నె తెచ్చారు. అందరిలో ఆయన రగిలించిన స్ఫూర్తి మరచిపోలేం. అటువంటి ఉన్నత వ్యక్తి, మేధావి మనల్ని విడిచిపెట్టి వెళ్లి పోవడం తీరనిలోటు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆ సాయినాథుని, వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను" అన్నారు మోహన్ బాబు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
నందమూరి బాలకృష్ణ ఆయన మృతిపై ఈ క్రింద విధంగా స్పందించారు.
"కృషి ఉంటే మనుషులు మహోన్నత స్థానానికి చేరుకుంటారనడానికి నిలువెత్తు నిదర్శనం మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంగారు. ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి రాష్ట్రపతి వరకు అంచెలంచెలుగా ఎదిగిన గొప్ప పర్సనాలిటీ. దేశానికి సైంటిస్ట్ గా, రాష్ట్రపతిగా ఆయన చేసిన సేవలు కొనయాడదగ్గవి.
ఆయన ఒక సైంటిస్ట్ భారతదేశాన్ని ప్రపంచంలో సగర్వంగా నిలబెట్టారు. ఎప్పుడూ యువత అన్నింటా ముందుండాలని కోరుకునేవారు. అటువంటి మహోన్నత వ్యక్తి మరణం మన దేశానికే తీరని లోటు. ఆయన లేని లోటును ఎవరూ తీర్చలేనిది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను." అన్నారు బాలకృష్ణ.
మన ప్రియతమ అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం (84) కాల ధర్మం చెందారు. భారత క్షిపణి పితామహుడు, మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సోమవారం హఠాత్తుగా కనుమూశారు. యావద్భారత దేశాన్ని హతాశులను చేశారు.

షిల్లాంగ్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో సాయంత్రం 6.30కు ఉపన్యాసమిస్తూ కలాం ఒక్కసారిగా కుప్పకూలారు. సాయంత్రం 5.40కు ఆయన ఇక్కడకు చేరుకున్నారు. కొంత సేపు విశ్రాంతి తీసుకున్నారు. 6.35కు 'లివబుల్ ప్లానెట్' అనే అంశంపై ఉపన్యాసం ప్రారంభించారు. ఐదు నిమిషాల తర్వాత కుప్పకూలారు. హుటాహుటీన ఆయనను స్థానిక బెథనీ ఆస్పత్రికి తరలించారు.
అప్పటికి రాత్రి ఏడు అయింది. ఆ ఆస్పత్రి ఐఐఎం నుంచి కి.మీ.దూరంలో ఉంది. అక్కడ ఐసీయూలో చికిత్స ప్రారంభించారు. సైనిక ఆస్పత్రి, నార్త్ ఈస్ట్రన్ ఇందిరాగాంధీ రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్కు చెందిన వైద్యులు శతథా ప్రయత్నించినా ప్రాణాలు దక్కలేదు. అత్యవసర సేవల విభాగంలో 45 నిమిషాల పాటు ఆయన్ని పరీక్షించాక 7.45కు విషాద వార్తను ధ్రువీకరించారు.
మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పార్థివదేహాన్ని షిల్లాంగ్ నుంచి గువహటి తరలించారు. షిల్లాంగ్ నుంచి రక్షణశాఖ ప్రత్యేక విమానంలో కలాం పార్థీవదేహాన్ని గువహాటికి తీసుకొచ్చారు. రక్షణ దళాల అధికారులు ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు.


Click it and Unblock the Notifications











