త్రివిక్రమ్ కు తంటా..ప్రభుత్వం మీదకు ఎదురుదాడితో, ఏపీ సీఎం దగ్గరకు పంచాయతీ..రంగంలోకి దిగిన హారిక హాసిని సంస్థ!
ఏపీ ప్రభుత్వం ఇటీవల సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణలు చేస్తూ అసెంబ్లీలో ఓ బిల్లు ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని తీసుకు రావడంతో పాటు టికెట్ రేట్స్ తగ్గించాలని కూడా బిల్లులో పేర్కొంది. ఈ విషయం మీద ఏపీ ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్నట్లుగా ఉన్న ఒక ఫేక్ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

చుట్టుముడుతున్నట్టే
ఆంధ్ర ప్రదేశ్ సినిమా టికెట్ ధర సమస్యలు, రోజుకు నాలుగు షోలు మాత్రమే వేసుకోవాలని ఎలాంటి బెనిఫిట్ షోలు వేయకూడదని ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సినిమాటోగ్రఫీ బిల్లులో ఉండడంతో టాలీవుడ్ను వరుస సమస్యలు చుట్టుముడుతున్నట్టయింది. అయితే ఈ ఆన్లైన్ టికెటింగ్ విధానంపై పరిశ్రమ నుంచి చిరంజీవి సహా కొంత మంది హర్షం వ్యక్తం చేశారు.

ఎదురుదాడికి దిగినట్టు
అదే సమయంలో దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న విధంగా టికెట్ ధరలు నిర్ణయిస్తే బావుంటుందని, ఆ విషయమై పునరాలోచించాలని చిరంజీవి విజ్ఞప్తి చేశారు. అలాగే, ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం సోషల్ మీడియా వేదికగా టికెట్ రేట్స్ గురించి స్పందించినట్టు వార్తలు వచ్చాయి. తెలుగు ప్రింట్ మీడియాలో వచ్చిన ప్రకటన ప్రకారం టిక్కెట్ ధరలను నియంత్రించే విషయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ జగన్ ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగినట్టుగా ఉంది.

సోషల్ మీడియాలో వైరల్ కావడంతో
స్కూల్ ఫీజులు, వైద్య ఖర్చులను ఒకే రేటుగా పెట్టి విద్యా, ఆరోగ్య రంగంలో ఎందుకు అమలు చేయడం లేదని, కేవలం సినీ పరిశ్రమకే ఎందుకు పరిమితం చేస్తారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టు ట్వీట్ ఉంది. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉన్న మంత్రి పేర్ని నాని దృష్టిని ఆకర్షించింది.

ఎటువంటి సంబంధం లేదు
దీంతో ఆయన స్పందిస్తూ అన్ని ఫిర్యాదులను వైఎస్ జగన్ వద్దకు తీసుకెళ్తానని చెప్పారు. త్రివిక్రమ్ ట్వీట్ చేసినట్లు శుక్రవారం అమరావతి సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ ట్వీట్కు, ట్విట్టర్ ఖాతాకు, దర్శకులు త్రివిక్రమ్కు ఎటువంటి సంబంధం లేదని త్రివిక్రమ్ కు చాలా సన్నిహితంగా ఉండే హారిక హాసిని సంస్థ క్లారిటీ ఇచ్చింది

నమ్మవద్దు
"త్రివిక్రమ్ గారికి ఎటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ లేవు. ఆయన పేరు లేదా ఫొటో ఉపయోగించి వివిధ ఖాతాల్లో చేసిన కామెంట్స్ను నమ్మవద్దు. త్రివిక్రమ్ గారి నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ ఏదైనా సరే హారిక అండ్ హాసిని క్రియేషన్స్ & ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ అకౌంట్ల నుంచి మాత్రమే వస్తుంది" అని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ & ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు ట్వీట్ చేశాయి.

అకౌంట్లు లేవు
త్రివిక్రమ్ కు ముందు నుంచి ఎలాంటి సోషల్ మీడియా అకౌంట్లు లేవు. అయితే ఆయనకు చాలా మంది అభిమానులు ఉండడంతో ఆయన పేరుతో ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో అకౌంట్స్ ఓపెన్ చేశారు. త్రివిక్రమ్ రాసిన డైలాగులు, సినిమా ఈవెంట్స్లో ఆయన మాట్లాడిన మాటలను పోస్ట్ చేస్తుంటారు. అలాగే ఈ ఏపీ టికెట్ రేట్ల అంశం మీద కూడా స్పందించడంతో అది సీఎం దాకా తీసుకు వెళతానని పేర్ని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.


Click it and Unblock the Notifications











