మీడియా ప్రతినిధి 5 కోట్లు డిమాండ్.. ఆత్మహత్యే నాకు శరణ్యం.. వేణుస్వామి సంచలన వీడియో
గత కొద్దినెలలుగా తాను చెబుతున్న జోస్యాలు రివర్స్ అవుతుండటంతో సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఏపీ, తెలంగాణ ఎన్నికల ఫలితాలు, ఐపీఎల్ ఇలా చాలా విషయాల్లో వేణుస్వామి జోస్యం తారుమారైంది. ఆ దెబ్బతో ఆయనపై విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. దీంతో తాను సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై జోస్యం చెప్పనని , రాజకీయ విశ్లేషణ కూడా చేయనని వేణుస్వామి తేల్చిచెప్పారు. అలాంటిది అక్కినేని నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ చేసుకుని గంటలు గడవక ముందే వారిపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
వీరిద్దరూ ఎక్కువ కాలం కలిసి ఉండరని, ఓ అమ్మాయి వల్ల విడిపోతారని వేణుస్వామి చెప్పాడు. ఈ దెబ్బతో అక్కినేని ఫ్యాన్స్ భగ్గుమన్నారు. శుభమా అని తమ హీరో ఓ ఇంటి వాడవుతుంటే ఆ మాటలేంటీ అంటూ ట్రోలింగ్కు దిగారు. ఫిల్మ్ జర్నలిస్టులైతే ఏకంగా పోలీసులను, మహిళా కమీషన్ను ఆశ్రయించడంతో.. కమీషన్ నోటీసులు జారీ చేసింది. అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తుండటంతో వేణుస్వామి స్పందించారు. గతంలో నాగచైతన్య - సమంత జాతకాలకు కొనసాగింపుగానే ఈ జోస్యం చెప్పినట్లు వివరణ ఇచ్చాడు.

కానీ వేణుస్వామిపై ట్రోలింగ్ ఏమాత్రం తగ్గలేదు సరికాదా.. ఇంకాస్త పెరిగిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం వేణుస్వామి, తన భార్య వీణ శ్రీవాణితో కలిసి ఓ వీడియో రిలీజ్ చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీవీ5 మూర్తి , ఆయన బృందం తనను డబ్బులు డిమాండ్ చేసి వేధిస్తోందని.. అంత డబ్బు ఇవ్వలేమని ఇక మాకు ఆత్మహత్యే శరణ్యమని ఈ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. మహాటీవీలో ఉన్నప్పటి నుంచే మూర్తి తనను నాశనం చేయడానికి ప్రయత్నాలు చేశాడని.. ఇప్పుడు పథకం ప్రకారం టీవీ5లో తన గురించి డిబేట్లు నిర్వహిస్తున్నారని వేణుస్వామి ఆరోపించారు. ఎంతోమంది కష్టాలను తొలగించిన తనకు , చివరికి ఆత్మహత్య చేసుకునే స్థితికి మూర్తి తీసుకొచ్చాడని ఆయన పేర్కొన్నారు.
వీణ శ్రీవాణి మాట్లాడుతూ.. టీవీ5 మూర్తి రూ.5 కోట్లు డిమాండ్ చేస్తున్నారని.. అంత డబ్బు తామెక్కడి నుంచి తీసుకురాగలమని ఆమె వాపోయారు . నా బంగారం, నా కూతురు బంగారం అమ్మినా అంత డబ్బు రాదని.. కానీ వీళ్లు వదిలేలా లేరని మేము ఆత్మహత్య చేసుకున్నా .. దానిపైనా రకరకాలుగా వార్తలు రాస్తారని శ్రీవాణి తెలిపారు. ఈ వీడియో బయటకు వచ్చాక తమను వాళ్లు చంపేస్తారని.. కానీ ఈ లోపు వారు ఎలాంటి వారో ప్రపంచానికి చూపిస్తున్నామని.. మూర్తితో పాటు మరికొందరు జర్నలిస్టులకు కూడా ఇందులో వాటాలు ఉన్నాయని ఆమె చెప్పారు.
తమ వద్ద సాక్ష్యాధారాలు వున్నాయని.. మాకు జర్నలిస్టులు, బ్రాహ్మణ సంఘాలు, పోలీసులు, లాయర్లు ఎవరు సపోర్ట్ చేస్తారో.. ఎవరో ఒకరు అండగా నిలుస్తారని ఆశిస్తున్నామన్నారు. జ్యోతిష్యం చెప్పుకునే తమ లాంటి వారినే రూ.5 కోట్లు అడిగారంటే మిగిలిన వారి పరిస్ధితి ఏంటీ.. ఈ వీడియో వచ్చిన తర్వాత మేం బతికుంటే ఇంకో వీడియో పెడతామని.. లేదంటే ఇదే చివరి వీడియో కావొచ్చునంటూ వేణుస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, మరి దీనిపై టీవీ5 మూర్తి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











