ఎన్టీఆర్కు గుడి కట్టిన అభిమాని
చిత్తూరు: సాధారణంగా నటులుకు గుళ్లు కట్టే సంప్రదాయం తమిళనాట ఉంది. కానీ ఇక్కడ వేరు. తమకు ముఖ్యమంత్రిగా సాయం చేసిన నందమూరి తారక రామారావుకి ఓ అభిమాని గుడి కట్టారు. 'ఆపదలో ఆదుకున్న వారిని ప్రా ణం వున్నంతవరకు మరచి పోకూడద'న్న తల్లి మాటకు ఆయన కట్టుబడ్డాడు. తమను ఆపదలో ఆదుకున్న మాజీ ముఖ్య మంత్రి ఎన్టీఆర్కు ఏకంగా ఓ గుడి నిర్మించాడు. కానీ ఆయన నిలువెత్తు విగ్రహ ప్రతిష్ఠాపన కోసం రోజులు లెక్కిస్తున్నాడు.
వివరాల్లోకి వెళితే.... చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం కంచెనపల్లికి చెందిన పెనుమచ్చ శ్రీనివాసులుది నిరుపేద కుటుంబం. 1985లో సంభవించిన పెను తుపానుకు అందరితోపాటు వారూ నిరాశ్రయులయ్యారు. అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఈ ప్రాంతాన్ని పరిశీలించి నిరాశ్రయులైన పేదలకు బట్టలు, బియ్యం, వంటపాత్రలు, వంట సరుకులు పంపిణీ చేశారు. తమ ఆకలి తీర్చిన ఎన్టీఆర్ వారికి ఆపద్బాంధవుడైనాడు. ఆనాటినుంచి రామారావుకు వీరాభిమానిగా మారాడు.
రామారావును దైవంగా తలచి, ఆయనకో గుడి కట్టాలని నిర్ణయించుకుని, రోజూ కూలికెళ్లి సంపాదించిన మొత్తంలో కొంత కూడబెట్టి, ఇంకొంత అప్పు చేసి, చివరకు ఓ చిన్న గుడి కట్టాడు. ఓ దాత సహాయంతో చిన్న ఎన్టీఆర్ విగ్రహమూ సమకూర్చుకున్నాడు. నిత్య పూజలు చేస్తున్నాడు. ఈ గుడికి మరికొంతమంది ఎన్టీఆర్ ఆభిమానులు వచ్చి వెళ్తూ ఉంటారు.


Click it and Unblock the Notifications












