ఏడిద నాగేశ్వరావుకు చిరు, కె విశ్వనాథ్, బన్నీ నివాళులు...
హైదరాబాద్: ప్రముఖ తెలుగు నిర్మాత ఏడిద నాగేశ్వరరావు(81) ఇక లేరు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రితో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం కన్ను మూసారు. ఆయన మరణంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.
తెలుగు సినిమా పరిశ్రమలో ఆణిముత్యాల్లాంటి సినిమాలైన శంకరాభరణం, సాగర సంగమం, ఆపద్భాంధవుడు, స్వాతి ముత్యం, స్వయం కృషి లాంటి ఎన్నో గొప్ప చిత్రాలను ఏడిద నాగేశ్వరరావు నిర్మించారు. డబ్బు సంపాదించే నిర్మాతగా కాకుండా సినిమాలపై పాషన్ ఉన్న నిర్మాతగా ఆయన పేరు తెచ్చుకున్నారు.
ఏడిద నాగేశ్వరరావు ఏప్రిల్ 24, 1934లో ఈస్ట్ గోదావరిలో జిల్లాలో జన్మించారు. తెలుగు సినిమా పరిశ్రమ నుండి జాతీయ అవార్డు అందుకున్న తొలి తెలుగు సినిమా ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన శంకరాభరణం సినిమా కావడం విశేషం. ఆయన నిర్మించిన స్వర్ణ కమలం బెస్ట్ ఫిల్మ్ గా అవార్డు అందుకుంది.
సోమవారం అంత్యక్రియల నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబుతో పాటు, పలువురు తెలుగు సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. చిరంజీవి, కె విశ్వనాథ్, కైకాల సత్యనారాయణ, అల్లు అర్జున్, నాగ బాబు, రాజేంద్రప్రసాద్, అల్లు అరవింద ఇతర సినీ ప్రముఖులు ఏడిద నివాసానికి చేరుకుని ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు

చిరంజీవి మాట్లాడుతూ..
ఏడిద నాగేశ్వరరావుతో నాకున్న అనుబంధం... కేవలం నిర్మాత, నటుడిగానే కాకుండా అత్యంత సన్నిహితుడు, ఆప్తుడు. ఆయనతో చేసిన స్వయం కృషి, ఆపద్భంధవుడు సినిమాలకు నాకు నంది అవార్డులు వచ్చాయి. ఆయన సినిమాలు ఒక్కొక్కటి ఒక్కో ఆణిముత్యం. అలాంటి గొప్ప వ్యక్తి మన మధ్య లేక పోవడం దురదృష్టం అన్నారు.

రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ..
తెలుగు సినిమా పరిశ్రమలో ముఖ్యుడు మంచి మనిషి ఏడిద నాగేశ్వరరావు. అసలు ప్లాపే లేని నిర్మాత. అద్భుతమైన తెలుగు సంస్కృతిని మాత్రమే చెప్పిన సినిమాలు తీసిన నిర్మాత, హాట్సాఫ్. ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన మహా నిర్మాతల్లో ఏడిద నాగేశ్వరరావు ఒకరు అన్నారు.

నాగబాబు మాట్లాడుతూ..
తెలుగు సినీ పరిశ్రమకు రాబోయే వంద సంవత్సరాలు గుర్తుండేలా సాగర సంగమం, శంకరా భరణం, స్వాతి ముత్యం లాంటి గొప్ప సినిమాలు తీసారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అన్నారు.

అల్లు అర్జున్ మాట్లాడుతూ...
శంకరా భరణం, స్వాతి ముత్యం, సిరి సిరి మువ్వ, ఆపద్భాందవుడు, స్వయం కృషి, సీతా కోక చిలుక లాంటి ఎన్నో మంచి సినిమాలు తీసారు. కేవలం డబ్బు కోసమే కాదు, తెలుగు సినిమాకు గౌరవం తెచ్చిన నిర్మాత ఏడిద నాగేశ్వరరావు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అన్నారు.

కోడి రామకృష్ణ మాట్లాడుతూ..
కమర్షియల్ సినిమాలు రాజ్యమేలుతున్న రోజుల్లో... కథ, మ్యూజిక్, దర్శకుడిపై నమ్మకంతో తీసిన ఆయన అభిరుచి ఎంతో గొప్పది అన్నారు.

కె.విశ్వనాథ్ మాట్లాడుతూ...
చాలా మంది మీకు నాగేశ్వరరావుకు ఉన్న అనుబంధం గురించి అడుగుతున్నారు. మద్రాసు నుండి మా అనుబంధం ఉంది. రక్త సంబంధం లాంటి అనుబంధం మాది. ఆయన కుటుంబానికి ఆత్మస్థైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.


Click it and Unblock the Notifications