ఫిలిం ఛాంబర్ కీలకనిర్ణయం.. రేపటి నుంచి తెలుగు సినిమా షూటింగులు బంద్!
తెలుగు సినీ పరిశ్రమ షూటింగ్స్ నిలిపివేయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలుగు యాక్టివ్ ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్ సినిమా షూటింగ్ లను ఆగస్టు ఒకటో తేదీ నుంచి నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం మీద ఛాంబర్ మాత్రం ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఎట్టకేలకు అనేక చర్చల తర్వాత తెలుగు ఫిలిం చాంబర్ కూడా ఈ విషయంపై నిర్ణయాన్ని వెల్లడించింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

నిలిపివేయాలని
తెలుగు సినిమాల నిర్మాణం వ్యయం భారీగా పెరిగిపోయిందని, భారీగా ఖర్చుపెట్టి సినిమాలు చేసి విడుదల చేస్తున్నా ధియేటర్లకు జనం రాని పరిస్థితుల్లో సినిమా నిర్మాణంపై మీద కూడా దృష్టి పెట్టారు నిర్మాతలు. అసలు హీరోల రెమ్యూనరేషన్ తగ్గించాలా లేక ఏదైనా ఇతర వ్యవహారాల మీద దృష్టి పెట్టాలా అంటూ ఆలోచనలో పడి ఈ విషయం మీద ఒక క్లారిటీ వచ్చేవరకు సినిమాలు షూటింగ్స్ కూడా నిలిపివేయాలని భావించారు.

అధికారికంగా
అందులో భాగంగానే ఆగస్టు ఒకటో తేదీ నుంచి సినిమా షూటింగ్స్ నిలిపివేయాలని ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని తెలుగు ఫిలిం చాంబర్ దృష్టికి తీసుకువెళ్లగా ఈ విషయం మీద ఫిలిం ఛాంబర్ అనేక విధాలుగా చర్చలు జరిపింది. ఎట్టకేలకు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయానికి మద్దతు ఇస్తూ ఆగస్టు ఒకటో తేదీ నుంచి సినిమా షూటింగ్స్ నిలిపివేయాలని అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని దిల్ రాజు సమక్షంలో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఫిలిం ఛాంబర్ ప్రకటించింది.

మళ్లీ ఎపుడు
దిల్ రాజు మాట్లాడుతూ నిర్మాతలు అందరూ కలసి జనరల్ బాడీ మీటింగ్ లో రేపటి నుండి సినిమా షూటింగ్స్ బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. అన్ని సమస్య లను పరిష్కరించాలని నిర్ణయం తీసుకున్నామన్న ఆయన అందరం కలసి ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. మేము అందరం రేపటి నుండి ఫెడరేషన్ సమస్య లపై చర్చలు జరుపుతామని ఆయన అన్నారు. అంతేకాక ఈ సినిమా షూటింగ్స్ మళ్లీ ఎపుడు మొదలు పెడతామన్నది చెప్పలేమని అన్నారు.

మాటలు కాదని
హీరోల రమ్యునరేషన్లు, డిజిటల్ రిలీజ్ వ్యవధి వంటి విషయాల మీద నిర్మాతలు దృష్టి పెట్టబోతున్నారు. ఇప్పటికే ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఈ విషయాల మీద పరిష్కారం కనుగొనడం కోసం కొన్ని కమిటీలను కూడా నియమించింది. ఇప్పటికే ఆ కమిటీలు ఈ విషయం మీద తలమునకలై పనిచేస్తున్నాయి. ఇదిలా ఉండగా మరోపక్క తెలంగాణ ఫిలిం ఛాంబర్ మాత్రం ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయానికి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించింది. కేవలం నలుగురు నిర్మాతలు కలిసి తీసుకున్న నిర్ణయానికి తాము కట్టుబడి ఉండే అవకాశం లేదని వారి పేర్కొన్నారు. తమ ఫిలిం ఛాంబర్ లో 50 మంది నిర్మాతలు ఉన్నారని వాళ్ళందరూ కూడా షూటింగ్స్ చేస్తున్నారని ఇప్పటికి ఇప్పుడు సినిమాలు షూటింగ్స్ ఆపివేయడం అంటే మాటలు కాదని పేర్కొన్నారు.

ఊరుకునే ప్రసక్తే లేదని
కేవలం నలుగురు నిర్మాతలు వారి స్వార్థం కోసం ఇదంతా చేస్తున్నారని వారే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి టికెట్ రేట్లు పెంచారని వాళ్లు ఇప్పుడు ఓటీటీలకు సినిమాలు ఇవ్వొద్దంటున్నారని విమర్శించారు. ప్రొడ్యూసర్స్ గిల్డ్, తెలుగు ఫిలిం ఛాంబర్ ఒక మాట మీదకు వస్తే ఇప్పుడు తెలంగాణ ఫిలిం ఛాంబర్ మరో మాట మీద ఉండడం ఆసక్తికరంగా మారింది. తమ షూటింగ్స్ నిలిపివేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని కూడా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రకటించిన నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











