విశాఖలో ఫిలిం సిటీ
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రం కాగా, వచ్చే యేడాదికల్లా విశాఖపట్నం మరో కేంద్రం కాబోతోంది. రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎఫ్డిసి) అధ్యక్షుడు జి. ఆదిశేషగిరి రావు ఈ విషయాన్ని వెల్లడించారు. విశాఖపట్నంలో ఫిలిం సిటీ నిర్మాణానికి రాష్ట్ర క్యాబినెట్ 316 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ ఇటీవల ఒక నిర్ణయం తీసుకుంది. ఈ ఫిలిం సిటీ నిర్మాణాన్ని ఎఫ్డిసి చేపడుతుంది. ఇప్పటికే విశాఖపట్నంలో చాలామంది సినీ ప్రముఖులు సినీ స్టూడియోలను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వారిలో కొందరు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు కూడా జరిపారు అని ఆదిశేషగిరి రావు తెలిపారు. ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు అప్పుడే స్టూడియో నిర్మాణం కూడా ప్రారంభించారు.
అయితే, స్టూడియోలను వేర్వేరు ప్రదేశాలలో కాకుండా ఒకే చోట నిర్మించేందుకు వీలు కల్పిస్తూ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 316 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఇక్కడ ఫిలిం సిటీ ఏ విధంగా రూపొందించాలనే విషయమై ప్రస్తుతం ఎఫ్ డి సి కొన్ని ప్రణాళికలు రూపొందిస్తోంది. వాటిని ఖరారు చేయగానే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు ఆదిశేషగిరి రావు తెలిపారు. ఈ ప్రక్రియ 2007 కల్లా పూర్తవుతుందని తెలిపారు.


Click it and Unblock the Notifications