ప్రముఖ తెలుగు దర్శకుడు మృతి
నాగార్జున(విక్రమ్), జగపతి బాబు(సింహస్వప్నం)లను తెలుగు పరిచయం చేసి, ఎన్నో విజయవంతమైన చిత్రాలను డైరక్ట్ చేసిన ప్రముఖ దర్శకుడు వీరమాచనేని మధుసూదనరావు (విక్టరీ మధుసూదనరావు) మృతి చెందారు. ఆయన బుధవారం రాత్రి ఆరున్నర గంటలకు హైదరాబాద్లో తుది శ్వాస విడిచారు. మధుసూదనరావు వయసు 89 సంవత్సరాలు. గత పదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలున్నారు. భార్య సరోజినీ దేవి 1999లోనే మరణించారు. మధుసూదనరావు 72 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 'రక్తసంబంధం', 'వీరాభిమన్యు', 'గుడిగంటలు', 'మనుషులు మారాలి',. 'ఆరాధన', 'లక్షాధికారి', 'గుడిగంటలు', 'జమిందారు', 'మంచి కుటుంబం', 'భక్తతుకారాం', 'ఆత్మీయులు', 'కల్యాణ మంటపం', 'మనుషులు మారాలి', 'అంతస్తులు', 'కృష్ణవేణి', 'కాంచనగంగ', 'ఎదురీత', 'మల్లెపూవు'లాంటి ఎన్నో అధ్బుతమైన చిత్రాలను ఆయన తెలుగు వారికి అందించారు.
'ఆత్మకథ', 'గుడిగంటలు', 'అంతస్తులు', 'ఆస్తిపరులు', 'ఆత్మీయులు', ' కాంచనగంగ', 'అమాయకురాలు', 'ప్రజానాయకుడు' చిత్రాలకు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు దక్కాయి. ఎఫ్డీసీకి డైరక్టర్గా బాధ్యతలు నిర్వర్తించారు. 1997లో రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని స్వీకరించారు. ఇక తెలుగులో స్టార్ డైరక్టర్స్ గా ఎదిగిన కె.రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, పి.సి.రెడ్డి, బోయిన సుబ్బారావు, వంశీ, శివనాగేశ్వరరావు ఈయన దగ్గరే దర్శకత్వ పాఠాలు నేర్చుకొన్నవారే. మధుసూదనరావు మృతికి ధట్స్ తెలుగు సంతాపం తెలియచేస్తోంది.


Click it and Unblock the Notifications











