2012:'బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ' సినిమాలు (ఫోటో ఫీచర్)
హైదరాబాద్ : 2012 సంవత్సరం దాదాపు ముగింపుకి వచ్చేసింది. ఈ సందర్భంలో ఈ సంవత్సరంలో ఎక్కువ హైప్ క్రియేట్ చేస్తూ జారిపడిన చిత్రాలు చాలా ఉన్నాయి. రిలీజ్ కు ముందు విపరీతమైన బిల్డప్ ని క్రియేట్ చేస్తూ దిగిన ఈ చిత్రాలు భాక్సాఫీస్ వద్ద నామరూపాలు లేకుండాపోయాయి. వాటి లిస్ట్ లో మొదట డబ్బింగ్ చిత్రాలు పరిశీలిస్తే... విజయ్ ..తుపాకి తప్ప హిట్ అనిపించుకున్న సినిమాలు లేవు.

ఈ చిత్రాల వరసలో మొదటగా నిలవాల్సిన చిత్రం 3. ధనుష్ హీరోగా వచ్చిన ఈ చిత్రం 'వై దిస్ కొలావరి...', పాటతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. అయితే సినిమాలో అతి ఎక్కువ అవటం,తెలియని రోగాలు గురించి చెప్పటంతో జనాలు కేవలం వందకు 3 మార్కులే వేసి బయిటుకు వచ్చేసారు.

సూర్య తమ్ముడు కార్తికి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఆ జోరులోనే కార్తి తొలి చిత్రం 'పరుత్తివిరన్'ని 'మల్లిగాడు' రూపంలో తీసుకొచ్చారు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు రుచించలేదు. రాజకీయపరమైన అంశాలతో అల్లుకున్న చిత్రంగా 'శకుని' వచ్చింది. అది కూడా నిరాశపరచింది. శకుని చిత్రం పూర్తిగా మహేష్ బిజినెస్ మ్యాన్ లా ఉందని విమర్శలు సంపాదించుకోవటం తప్ప రూపాయి సంపాదించలేకపోయింది. టీవీ ఛానెల్స్ లో ఎంతలా ఈ చిత్రం గురించి హోరెత్తించినా ఫలితం లేకుండా పోయింది.

ప్రేమ లేఖ అజిత్ నటించిన 'డేవిడ్ బిల్లా' కూడా పరాజయ చిత్రాల జాబితాలోకే చేరింది. . డబ్బింగ్ చిత్రమైనా ప్రతీ చోటా హౌస్ ఫుల్ బోర్డులు,బ్లాక్ లో టిక్కెట్లు అమ్మే స్ధితిలో క్రేజ్ క్రియేట్ చేసింది. అయితే సినిమా మాత్రం అందరి అంచనాలనూ తల క్రిందులు చేస్తూ ప్లాప్ గా మిగిలింది. స్టైలిష్ నటన పేరుతో సినిమాను లాజిక్ లు లేకుండా నత్త నడకతో నడిపించటం ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారింది. గతంలో అజిత్ గాంబ్లర్ మాదిరిగానే ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కానీ స్ధితి చేరుకుంది.

జీవా హీరోగా వచ్చిన రంగం ఆడటంతో, మిస్కిన్ దర్శకత్వంలో వచ్చిన మాస్క్ చిత్రం కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది. అయితే పబ్లిసిటీ మాస్క్ జనాలను మొదటి రోజు థియోటర్స్ దాకా తేవటానికే ఉపయోగపడింది. బ్యాట్స్ మెన్ చిత్రం కాపీలా ఉన్న చిత్రం జనాలు తిప్పికొట్టారు.

శంకర్ తో చేసిన 'అపరిచితుడు' తరవాత విక్రమ్కి తెలుగులో ఒక్క విజయమూ దక్కలేదు. ఈసారి ఆయన నటించిన 'శివతాండవం' విడుదలైంది. ఇందులో తెలుగు హీరో జగపతిబాబు కూడా నటించారు. ఈ చిత్రం ప్రేక్షకుల్ని రంజింపజేయలేకపోయింది. ఈ చిత్రాన్ని కూడా భారీ మొత్తానికే నిర్మాత సి.కళ్యాణ్ తీసుకుని నష్టపోయారు.

శంకర్ చిత్రాలంటే ఆంద్రప్రదేశ్ లో మంచి క్రేజ్. అపరిచితుడు,భారతీయుడు, జెంటిల్ మ్యాన్, ప్రేమికుడు ఇలా ప్రతీ శంకర్ సినిమా ఇక్కడ రికార్డులు క్రియేట్ చేసింది. అయితే తెలుగునాట ఈసారి శంకర్కీ చేదు అనుభవమే మిగిలింది. 'త్రీ ఇడియట్స్'ని తమిళంలో 'నన్బన్' పేరుతో రీమేక్ చేశారు. తమిళ రూపాన్ని తెలుగులోకి దిల్ రాజు 'స్నేహితుడు'గా తీసుకొచ్చారు. విజయ్, ఇలియానా జంటగా నటించారు. బాక్సాఫీసు దగ్గర ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది.

గజనీ తో తెలుగులో మార్కెట్ క్రియేట్ చేసుకున్న సూర్య ...ఇటీవల 'బ్రదర్స్' పేరుతో ప్రేక్షకుల్ని పలకరించారు. 'రంగం' తరవాత కె.వి.ఆనంద్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. పైగా సూర్య అవిభక్త కవలలుగా నటించారు. దాంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. అనుకున్న స్థాయిలో 'బ్రదర్స్' ఆదరణ పొందలేదు. ఇక్కడ ఎంతో ఖర్చు పెట్టి కొన్న నిర్మాత బెల్లంకొండ ను నట్టేట ముంచింది.

శ్రీదేవి దశాబ్దంన్నర తరవాత కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టారు... 'ఇంగ్లీష్ వింగ్లీష్' పేరుతో! ఈ హిందీ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లోకి అనువదించారు. తెలుగులో మినహా మిగిలిన రెండు భాషల్లోనూ నెగ్గుకొచ్చింది. తెలుగులో మాత్రం నిర్మాతలకు నష్టాన్నే మిగిల్చింది.
తమిళ, మళయాళంలో రిలీజైన ప్రతీ సినిమా హీరో, హీరోయిన్ కాస్త తెలిసి ఉన్న వారైతే చాలు అన్నట్లుగా ఇక్కడ రిలీజై పోతున్నాయి. అంతేకాదు రిలీజ్ కు ముందు తమిళ హీరోలు ఇక్కడ ప్రెస్ మీట్ లు పెట్టి తమ సినిమాకు విపరీతమైన క్రేజ్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సినిమా బాగుంటే చాలు - అది స్ట్రైయిట్ సినిమానా? డబ్బింగ్ బొమ్మా? అని ఆలోచించరు తెలుగు ప్రేక్షకులు అంటూ అవి ధైర్యంగా తెలుగు తెరపై దూకేస్తున్నాయి. కమల్ హాసన్ నుంచి కార్తి వరకూ విక్రమ్ నుంచి విశాల్ వరకూ... తెలుగు, తమిళ భాషలని ఏలాలనే తాపత్రయం. అంతేకాదు తెలుగు భాష నేర్చుకొని, తమ సినిమాలకు తామే డబ్బింగు చెప్పుకొంటున్నారు. అయితే ఇప్పుడు సీను రివర్స్ అయ్యింది. 2012లో డబ్బింగ్ చిత్రాల మార్కెట్కి గండిపడింది. ఈ యేడాది తుపాకీ తప్ప ఇప్పటి వరకూ ఒక్క అనువాద సినిమా కూడా బాక్సాఫీసు దగ్గర నిలబడలేకపోయింది. భారీ అంచనాలతో వచ్చి ఢాం అన్న డబ్బింగ్ సినిమాలను ఓ సారి గుర్తు చేసుకుంటే.


Click it and Unblock the Notifications











