పొంగుకొచ్చిన దు:ఖం.. దిగమింగుకొన్న ఎన్టీఆర్, కల్యాణ్ రాం.. హరికృష్ణ అంత్యక్రియలు పూర్తి
Recommended Video

సినీ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర రాణించిన నందమూరి హరికృష్ణ అభిమానులకు, సన్నిహితులకు, కుటుంబానికి భౌతికంగా దూరమయ్యాడు. బుధవారం ఉదయం నల్లగొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు గురువారం మధ్యాహ్నం నాలుగు గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలను నిర్వహించారు.

ఉద్విగ్నభరిత వాతావరణంలో
అభిమానులు, కార్యకర్తలు, సన్నిహితుల అశ్రునయనాల మధ్య హరికృష్ణ అంత్యక్రియలు ఉద్విగ్నభరిత వాతావరణంలో ముగిసాయి. హిందూ సంప్రదాయల ప్రకారం అంతిమ సంస్కారాలను నిర్వహించారు.

తీవ్ర విషాదంలో ఎన్టీఆర్, కల్యాణ్ రాం
హరికృష్ణ కుమారులు కల్యాణ్ రాం, ఎన్టీఆర్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పొంగుకొస్తున్న దు:ఖాన్ని దిగిమింగుతూ అంతిమ సంస్కారాలను పూర్తి చేశారు. చితిని పేర్చి గంధం చెక్కలు అమర్చారు.

తలకొరివి పెట్టిన కల్యాణ్ రాం
హరికృష్ణ పెద్ద కుమారుడు కల్యాణ్ రాం హరికృష్ణ చితికి నిప్పుపెట్టారు. అంతకు ముందు తలకొరివితో మూడుసార్లు చితి చుట్టు కల్యాణ్ రాం, ఎన్టీఆర్ ప్రదక్షినాలు చేశారు. ఎన్టీఆర్, కల్యాణం రాం అంత్యక్రియలు నిర్వహించడం చూసి అభిమానులు కంటతడి పెట్టారు.

పోలీసుల గౌరవ వందనం
కల్యాణ్ రాం చితికి నిప్పుపెట్టే ముందు తెలంగాణ ప్రభుత్వం తరఫున పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. కొన్ని రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. దీంతో అధికారిక లాంఛనాలు పూర్తయ్యాయి.

శ్రేయోభిలాషులు కన్నీరుమున్నీరు
అంత్యక్రియలు పూర్తయ్యేంత వరకు చితి వద్దే చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరావు, ఇరు రాష్ట్రాల మంత్రులు అక్కడే ఉన్నారు. హరికృష్ణ సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

హరికృష్ణ అమర్ రహే
అంత్యక్రియలు జరుగుతున్నంత సేపు అభిమానులు హరికృష్ణ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. తమ ప్రియనేత ఇక లేరనే విషాదంతో తిరుగుముఖం పట్టారు.

మహాప్రస్థానంలో హరికృష్ణ స్మారక స్థూపం
మహాప్రస్థానం పరిసర ప్రాంతంలో హరికృష్ణ స్మారక చిహ్నానికి స్థలం కేటాయిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. సుమారు 450 గజాల్లో హరికృష్ణ స్మారక స్థూపాన్ని ప్రభుత్వమే స్వయంగా నిర్మిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తెలిపారు.


Click it and Unblock the Notifications











