సీతా రామంపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు రివ్యూ.. చాలా కాలం తర్వాత అంటూ..
మాస్, మసాల,కమర్శియల్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాగానే ఆడతాయి. కానీ కొన్నిసార్లు అంతగా ఆకట్టుకోవు. కొన్ని చిత్రాలు మాత్రం మనసుకు హత్తుకునేలా ఉంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులో మనసుల్లో నాటుకుపోతాయి. ఇలా అన్ని వర్గాల ఆడియెన్స్ మెచ్చుకునేలా ఓ సినిమా తెరకెక్కంచడం అంటే మాటలు కాదు. అందులోనూ ఓ అందమైన ప్రేమ కథను ఓ మధురమైన దృశ్య కావ్యంగా మలచడం మాములు విషయం కాదు. అవును, మీరు అనుకుంటుంది నిజమే. మనం చెప్పుకునేది అందమైన ప్రేమ కావ్యంగా విజయం సాధించిన చిత్రం సీతా రామం గురించే. ఎలంటి వల్గారిటీ లేకుండా క్లాసిక్ లవ్ స్టోరీస్ తీసే ప్రయత్నం చేసే దర్శకులలో హను రాఘవపూడి ఒకరు. ఆయన తాజాగా మలిచిన బ్యూటీఫుల్ లవ్ స్టోరీ సీతా రామం. అందరి మన్ననలు పొందుతూ విజయంతో దూసుకుపోతున్న ఈ సినిమాను మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసించారు.
ఇంతకుముందులా తెలుగులో ఇప్పుడు మంచి ఫీల్ గుడ్ సినిమాలు పెద్దగా రావడం లేదు. దీంతో అలాంటి సినిమాల కోసం మూవీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన అందమైన ప్రేమకావ్యమే 'సీతా రామం'. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కింది ఈ చిత్రం.
బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, టాలీవుడ్ హీరో సుమంత్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మురళి శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏక కాలంలో ఈ సినిమాను రూపొందించారు. బడా నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్స్పై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ ఈ ప్రేమ కావ్యాన్ని నిర్మించారు. ఈ సినిమాకు అశ్వినీదత్ నిర్మాతగా వ్యవహరించడం, హను రాఘవపూడి దర్శకత్వంలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్తో పాటు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న రష్మిక మందన్నా నటించడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. విపరీతమైన అంచనాలతో ఆగస్టు 5న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది సీతా రామం.
అంచనాలకు తగినట్లుగానే సినిమా విడుదల రోజు నుంచే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతోంది సీతా రామం. అలాగే ఈ సినిమాపై పలువురు సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక క్లాసిక్ ప్రేమ కావ్యంగా సీతా రామం చిత్రాన్ని కొనియాడుతున్నారు. ఈ క్రమంలోనే సీతా రామం చిత్రంపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు. తాజాగా సీతా రామం చిత్రాన్ని వీక్షించిన వెంకయ్య నాయుడు ట్విటర్ వేదికగా ఆయన అనుభూతిని పంచుకున్నారు.
"సీతారామం' చిత్రాన్ని వీక్షించాను. నటీనటులు అభినయానికి, సాంకేతిక విభాగాల సమన్వయం తోడై చక్కని దృశ్యకావ్యం ఆవిష్కృతమైంది. సాధారణ ప్రేమ కథలా కాకుండా, దానికి వీర సైనికుని నేపథ్యాన్ని జోడించి, అనేక భావోద్వేగాలను ఆవిష్కరించిన ఈ చిత్రం ప్రతి ఒక్కరూ తప్పక చూడదగినది. చాలా కాలం తర్వాత ఓ చక్కని సినిమా చూసిన అనుభూతిని "సీతారామం" అందించింది. రణగొణధ్వనులు లేకుండా, కళ్ళకు హాయిగా ఉండే ప్రకృతి సౌందర్యాన్ని ఆవిష్కరించిన ఈ చిత్ర దర్శకుడు శ్రీ హను రాఘవపూడి, నిర్మాత శ్రీ అశ్వినీదత్, స్వప్న మూవీ మేకర్స్ సహా చిత్ర బృందానికి అభినందనలు'' అని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఈ ట్వీట్తోపాటు ఆయన కొన్ని సినిమా ఫొటోలను కూడా షేర్ చేశారు. ఈ ట్వీట్కు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ స్పందిస్తూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.


Click it and Unblock the Notifications











