సాయిపల్లవితో నా కుమారుడికి అఫైర్ లేదు.. ఏపీ మంత్రి క్లారిటీ
సినీ పరిశ్రమలో గాసిప్స్కు కొదవేమీ ఉండదు. ఎక్కడ నుంచి పుట్టుకోస్తాయో తెలీదు గానీ.. క్షణాల్లోనే ప్రపంచమంతా పాకిపోతుంటాయి. ఇలాంటి రూమర్ల బారిన ఎంతో మంది సినీ ప్రముఖులు పడ్డారు. తాజాగా ఫిదాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిన సాయి పల్లవికి ఈ చేదు వార్త ఎదురైంది. ఆంధ్రప్రదేశ్లోని ఓ మంత్రి కుమారుడు నటి సాయిపల్లవిని ప్రేమించారనే వార్త సోషల్ మీడియాలో ప్రముఖంగా కనిపించడమే కాకుండా వివాదంగా మారింది.

సాయిపల్లవిపై రూమర్లు
ఫిదా, ఎంసీఏ చిత్రాల తర్వాత సాయిపల్లవి నటించిన కణం సినిమాలో టాలీవుడ్లో రిలీజ్కు సిద్ధమైంది. ఆ చిత్ర ప్రమోషన్లో సాయిపల్లవి విస్తృతంగా పాల్గొన్నారు. కానీ మంత్రి కుమారుడితో ప్రేమ, పెళ్లి వివాదంపై ఆమె ఎక్కడా స్పందించలేదు. దాంతో ఎవరా మంత్రి కుమారుడు అనే చర్చ మీడియాలో విస్తృతంగానే జరిగింది.

ఏపీ మంత్రి స్పందన
సాయిపల్లవి, మంత్రి కుమారుడి అఫైర్ వార్తలు తగ్గుముఖం పట్టకపోవడంతో మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. తన కుమారుడు గంటా రవితేజపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

దుష్ప్రచారం చేయవద్దు..
తన కుమారుడు రవితేజ, సాయిపల్లవి మధ్య ఎలాంటి అఫైర్ లేదు. ఇలాంటి విషయాలపై సాధారణంగా స్పందించను. కానీ రూమర్ల స్థాయి పెరిగిపోవడంతో స్పందించాల్సి వచ్చింది. అవాస్తవమైన, నిరాధారమైన వార్తలతో ఎవరిపైనైనా దుష్ప్రచారం చేయవద్దు అని మంత్రి గంటా కోరారు.

అలాంటి వార్తలు రాస్తారా?
ఇతరుల జీవితాలపై మచ్చ పడే విధంగా వార్తలు రాయడం సరికాదు. నా కుమారుడికి ఇప్పటికే వివాహమైంది. ఆ విషయాన్ని మరిచిపోయి అవాస్తవాలను ప్రచురిస్తున్నారు. ఇలాంటి వార్తల వల్ల జీవితాల్లో ప్రతికూల పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది అని మంత్రి గంటా ఓ ప్రకటనలో తెలిపారు.

జయదేవ్తో రవితేజ ఎంట్రీ
మంత్రి గంటా శ్రీనివాస్రావు కుమారుడు రవితేజ ఇటీవల ‘జయదేవ్' సినిమాతో హీరోగా టాలీవుడ్లోకి ప్రవేశించారు. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవితేజ ఆ సినిమాలో కనిపించిన సంగతి తెలిసిందే.

సాయి పల్లవితో పీకల్లోతు ప్రేమలో
అయితే సాయిపల్లవితో మంత్రి కుమారుడు పీకల్లోతు ప్రేమలో పడ్డారు. తన తల్లిదండ్రులకు మంత్రి కుమారుడు తన అఫైర్ గురించి చెప్పి ఒప్పించారు. ఆ నేపథ్యంలో సాయిపల్లవి కుటుంబంతో మంత్రి కుటుంబం మాట్లాడారు. అయితే మంత్రి ప్రపోజల్ను సాయిపల్లవి కుటుంబ సభ్యులు తిరస్కరించారు అనే ఓ నిరాధారమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడతున్నది.

శర్వానంద్తో సాయిపల్లవి
వరుస విజయాలతో దూసుకెళ్తున్న సాయిపల్లవి ప్రస్తుతం శర్వానంద్తో కలిసి నటిస్తున్నది. వీరిద్దరూ కలిసి నటించిన పడి పడి లేచే మనసు ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది. కాగా, తమిళంలో తనకిష్టమైన సూర్యతో ఓ సినిమా కూడా చేస్తున్నది.


Click it and Unblock the Notifications











